దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. భారత బెంచ్ మార్క్ సూచీలు గురువారం భారీ అమ్మకపు ఒత్తిడిని చవిచూశాయి. మార్కెట్ ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1236.11 పాయింట్లు లేదా 1.48 శాతం క్షీణించి 82,498.14 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 365.00 పాయింట్లు లేదా 1.41 శాతం నష్టపోయి 25,454.35 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుండి బెంచ్ మార్క్ లు అత్యంత చెత్త పతనాన్ని నమోదు చేశాయి.
పెరుగుతున్న ముడి చమురు ధరలు, పెరుగుతున్న యుఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ హెవీవెయిట్లలో ప్రాఫిట్ బుకింగ్ మధ్య సెషన్ లో మార్కెట్ క్రాష్ వచ్చింది. ఇండిగో, ఎం అండ్ ఎం, అంట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, బీఈఎల్ షేర్లు 3.2 శాతం వరకు పడిపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.59 శాతం, 1.27 శాతం నష్టపోయాయి.


