పాట్నా: 42 మంది అధికార, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు బిహార్ హైకోర్టు బిగ్ షాకిచ్చింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో ఎమ్మెల్యేలు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు పలువురు బిహార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించింది. ఆ నోటీసులపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
విచారణ సందర్భంగా అఫిడవిట్లో ఎమ్మెల్యేల తప్పుడు సమాచారంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు అఫిడవిట్ దాఖలు చేయడం తప్పని సరి. తద్వారా పోటీచేసే అభ్యర్థుల ఆస్తులు,వారి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేందుకు ప్రజలకు అవకాశం ఉంటుంది.ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా అఫిడవిట్ దాఖలు చేయడం సరైంది కాదు’అని వ్యాఖ్యానించింది. అనంతరం, నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు న్యాయస్థానం విధించిన గడువులోగా వివరణ ఇవ్వాలని సూచించింది.
బిహార్ హైకోర్టు నోటీసులు పంపిన వారిలో అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్కుమార్ సైతం ఉన్నారు. స్పీకర్తో పాటు మంత్రి విజేంద్రయాదవ్, మాజీ మంత్రి జివేష్ మిశ్రా,జేడీయూ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్,ఆర్జేడీ ఎమ్మెల్యే అమరేంద్ర ప్రసాద్లు ఉన్నట్లు తెలుస్తోంది.


