బంగ్లాదేశ్ ప్రధానిగా నేడు తారిఖ్ రహ్మన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల ఆదేశంలో జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ పార్టీ గ్రాండ్ విక్టరీ సాధించిన నేపథ్యంలో ఆయన ప్రధాన మంత్రిగా నేడు బాధ్యతలు తీసుకోనున్నారు. తారిఖ్ రహ్మన్ ప్రమాణస్వీకార వేడుకకు భారత్తో సహా దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు.
గత రెండేళ్లుగా బంగ్లాదేశ్ అశాంతితో రగిలిపోయింది. అక్కడి ప్రభుత్వాలకు నిరసనగా అక్కడి ప్రజలు పెద్దఎత్తున ఉద్యమబాట పట్టారు. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉద్యమాలు జరిపారు. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హాసీనా ఆ దేశాన్ని వీడి భారత్లో తలదాచుకున్నారు. అనంతరం ఆ దేశ చీఫ్ అడ్వయిజర్గా మహ్మద్ యూనస్ పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గతేడాది అక్కడి రాడికల్ నేత ఉస్మాన్ హాదీ మృతితో ఆదేశంలో మరోసారి నిరనలు పెల్లుబెక్కాయి. మైనార్టీలపై దాడులు జరిగాయి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇంత అస్థితరతల మధ్య ఎన్నికలు జరుగగా ఎన్నికలలో ఎట్టకేలకు బీఎన్పీ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టబోతుంది.
బంగ్లాదేశ్ ప్రధానిగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఛైర్మన్ తారిఖ్ రహ్మన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన ప్రమాణస్వీకార వేడుకకు అక్కడి పార్లమెంటు భవన్లోని సౌత్ ప్లాజా వేదిక కానుంది. ఈ కార్యక్రమం సాయంత్రం 4గంటలకు ప్రారంభం కానున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే ఈ వేడుకకు భారత్తో సహా 13దేశాలను ఆహ్వానం పంపగా ఇండియా నుంచి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ ఈ వేడుకకు హాజరుకానున్నారు.
వారితో పాటు విదేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన దాదాపు 1200 మందికి బంగ్లాదేశ్ ఆహ్వానం పంపింది.ఇటీవల 297 స్థానాలకు ఎన్నికలు జరుగగా బీఎన్పీ 209 స్థానాల్లో గెలుపొందింది. కాగా ఇంతకాలం 17 ఏళ్లుగా లండన్లో ఉన్న ఆయన ఇటీవల బంగ్లాదేశ్కు తిరిగి వచ్చారు. బీఎన్పీ పార్టీ దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత అధికారం చేపట్టబోతుంది.


