ప్రభుత్వ గృహాల ప్రాజెక్టులో అక్రమాల కేసులో దోషిగా తేల్చిన బంగ్లాదేశ్ కోర్టు
ఢాకా: పదవీచ్యుత బంగ్లాదేశ్ మహిళా ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఢాకా కోర్టు పదేళ్ల కారాగార శిక్ష విధించింది. ప్రభుత్వ గృహాల ప్రాజెక్టులో భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయంటూ నమోదైన రెండు కేసుల్లో హసీనాతోపాటు ఆమె బంధువులను ఢాకా కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి దోషిగా తేల్చారు.
లబి్ధదారులకు బదులుగా హసీనా తన బంధువు, బ్రిటన్ లేబర్ పార్టీ మహిళా ఎంపీ, మాజీ బ్రిటన్ మంత్రి తులిప్ సిద్ధిఖ్సహా పలువురికి రెసిడెన్షియల్ ప్లాట్లను కేటాయించారన్న వాదనలతో న్యాయమూర్తి రూబియుల్ ఆలమ్ ఏకీభవించారు.
ఢాకా శివారులోని పూర్బకోల్లోని రజూక్ న్యూ టౌన్ ప్రాజెక్టులో ఈ అక్రమాలు వెలుగుచూశాయని గతంలో కేసు నమోదైంది. శిక్ష పడిన హసీనా ఇద్దరు మేనకోడళ్లు, మేనల్లుడిని పోలీసులు వెంటనే వేర్వేరు కారాగారాలకు తరలించారు. సిద్ధిఖ్ చిన్న సోదరి ఆలజమాన్ సిద్ధిఖ్, సోదరుడు రద్వాన్ ముజీబ్ సిద్ధిఖ్ బాబీలకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష వేస్తూ సోమవారం మధ్యాహ్నం 12. 30 గంటలకు జడ్జి తీర్పు వెలువర్చారు.
16 మంది నిందితులకు గాను ప్లాట్లు కేటాయించిన రజూక్ ప్రాజెక్టు సీనియర్ అధికారి ఖుర్షీద్ ఆలమ్ మాత్రమే కోర్టు హాలులో హాజరయ్యారు. గృహశాఖ సహాయ మాజీ మంత్రి ,అదే శాఖలో మాజీ కార్యదర్శి, రజూక్ ప్రాజెక్ట్ చైర్మన్, ఇతర అధికారులకు ఐదేళ్ల కారాగార శిక్ష పడింది. తన శిక్షపడడంపై హసీనా స్పందించారు. ‘‘ఇలాంటి తీర్పును ముందే ఊహించాం. ఈ కేసులన్నీ మొహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం కక్షసాధింపుతో వేసిన తప్పుడు కేసులు.
ఇవన్నీ కుట్రపూరితంగా తప్పుడు సాక్ష్యాలతో అల్లిన కేసులు’’అని హసీనా వ్యాఖ్యానించారు. నాటి బంగ్లాదేశ్ ప్రభుత్వంతో నాకెలాంటి సంబంధం లేదు. అయినాసరే నాపై ఏడాదిన్నరగా తప్పుడు ఆరోపణలు ప్రచారంచేస్తున్నారు’’అని తులిప్ సిద్ధిఖ్ అన్నారు. 2024 ఆగస్ట్ ఐదున బంగ్లాదేశ్ విద్యార్థులు, యువత సారథ్యంలో ఉవ్వెత్తున ఎగసిన ‘జూలై ఉద్యమం’ధాటికి షేక్ హసీనా సారథ్యంలోని అవామీలీగ్ ప్రభుత్వం కుప్పకూలిన విషయం విదితమే. ఆ తర్వాత హసీనాపై కేసుల పరంపర మొదలైంది.


