ప్రస్తుతం ఇరాన్, యుఎస్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అణు ఒప్పందంపై తగ్గకపోతే ట్రంప్ దాడి చేస్తానని హెచ్చరించడం. ఇరాన్ సుప్రీం లీడర్ తగ్గేదేలే అనడంతో రెండు దేశాల మధ్య వైరం మరింతగా ముదిరింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ప్రతినిధులు త్వరలో అణు ఒప్పందంపై కీలక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ట్రంప్ ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించారు. అణుఒప్పందంపై దిగిరాకపోతే ఈ సారి జరిగే దాడి వెనిజువెలాను మించి ఉంటుందన్నారు. దానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సైతం ఘాటుగా రిప్లై ఇచ్చారు. అమెరికా తమపై దాడి చేస్తే అది ప్రాంతీయ యుద్దానికి దారి తీస్తుందని బదులిచ్చారు. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదా అని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం ఇస్తాంబుల్లో జరిగే చర్చలలో ఏం జరుగుతుందా అని ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
డొనాల్డ్ ట్రంప్ పత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ ఆర్కీ ఇద్దరు టర్కీ ఇస్తాంబుల్లో సమావేశం కానున్నారు. ఈ సమాచారాన్ని అమెరికా అధికారులు ప్రకటించారు. స్టీవ్ విట్కాఫ్ మాట్లాడుతూ" అధ్యక్షుడు వారిని ఒప్పందం కోసం పిలుస్తున్నారు. సమావేశంలో ఇరాన్ ఏమంటుందో తెలుస్తుంది" అని అన్నారు.
అయితే గతంలో టెహ్రాన్ సైతం అణుఒప్పందపై చర్చలకు సిద్ధంగా ఉందని ఆ దేశ అధికారులు తెలిపారు. దీంతో ఇరు దేశాలు చర్చలకు సముఖంగా ఉండడంతో దాదాపు చర్చలు జరిగే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి.


