డాలర్ ఆధిపత్యానికి గండి! | Iran Israel Tensions, Oil Trade Shift Dollar To Yuan Payments US Sanctions, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

డాలర్ ఆధిపత్యానికి గండి!

Mar 18 2026 8:37 AM | Updated on Mar 18 2026 10:00 AM

Iran Israel Tensions Oil Trade Shift Dollar to Yuan Payments US Sanctions

పశ్చిమాసియాలో ముదురుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ప్రపంచ భౌగోళిక రాజకీయాలతోపాటు అంతర్జాతీయ ఆర్థిక ముఖచిత్రాన్ని కూడా వేగంగా మారుస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు కీలకంగా ఉన్న హర్మూజ్‌ జలసంధి కేంద్రంగా సాగుతున్న ఈ పరిణామాలు అమెరికా డాలర్ ఏకఛత్రాధిపత్యానికి సవాలు విసురుతున్నాయి.

డీ-డాలరైజేషన్ వేగవంతం?

హర్మూజ్‌ జలసంధి గుండా ప్రపంచంలోని 20% పైగా చమురు రవాణా జరుగుతుంది. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఇరాన్, దానికి మద్దతు ఇచ్చే కొన్ని దేశాలు చమురు వ్యాపారాన్ని డాలర్లకు బదులు చైనా కరెన్సీ ‘యువాన్’లో జరపాలని యోచిస్తున్నాయి.

అంతర్జాతీయ వాణిజ్యంలో 80% పైగా చమురు లావాదేవీలు డాలర్లలోనే జరుగుతాయి. ఇప్పుడు యువాన్ వైపు మొగ్గు చూపడం వల్ల డాలర్‌కు ఉన్న గ్లోబల్ డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతింటే సురక్షితమైన కరెన్సీగా డాలర్‌ను కాకుండా ప్రత్యామ్నాయాల వైపు దేశాలు చూడటం అమెరికా ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక నష్టం కలిగిస్తుంది.

భారత రూపాయిపై ప్రభావం

ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ కరెన్సీ మార్పుల ప్రభావం భారత రూపాయిపై ద్వంద్వ ప్రభావం చూపే అవకాశం ఉంది.

చైనా ఆధిపత్యం పెరగడం

అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో యువాన్ పట్టు సాధిస్తే అది ఆసియాలో చైనా ఆర్థిక శక్తిని మరింత పెంచుతుంది. భారత్‌కు చైనాతో సరిహద్దు వివాదాలు, వాణిజ్య పోటీ ఉన్న నేపథ్యంలో మన పొరుగు దేశం కరెన్సీ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా మారడం భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ లావేదేవీలు సర్వసాధారణం. ఒకవేళ యువాన్ వాడకం పెరిగితే భారత్ తన చమురు దిగుమతుల కోసం యువాన్‌ను భారీగా కొనాల్సి ఉంటుంది. దీనివల్ల మార్కెట్లో యువాన్‌కు డిమాండ్ పెరిగి రూపాయి విలువ దానికి సాపేక్షంగా తగ్గే ప్రమాదం ఉంది. దాంతో మన విదేశీ మారక నిల్వలలో డాలర్ల కంటే యువాన్ నిల్వలను ఎక్కువగా ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అమెరికాతో సంబంధాలపై ప్రభావం

భారత్-అమెరికా మధ్య రక్షణ, ఆర్థిక సంబంధాలు బలంగా ఉన్నాయి. ఒకవేళ భారత్ భారీ ఎత్తున యువాన్ వ్యవస్థలోకి వెళ్తే అది అమెరికా ఆగ్రహానికి కారణం కావచ్చు. ఇది ద్వైపాక్షిక సంబంధాలపై, అమెరికా నుంచి వచ్చే పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. దశాబ్దాలుగా మన బ్యాంకింగ్ వ్యవస్థ డాలర్ ఆధారిత లావాదేవీలకు(స్విఫ్ట్‌) అలవాటు పడి ఉంది. అకస్మాత్తుగా యువాన్ వ్యవస్థలోకి మారాలంటే కొత్త ఆర్థిక మౌలిక సదుపాయాలు, ఒప్పందాలు చేసుకోవాలి. దీనివల్ల లావాదేవీల ఖర్చు పెరిగే అవకాశం ఉంది.

భారత్ ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి?

చైనా యువాన్‌కు బదులుగా భారత్ ‘రూపాయి-రియల్’ (ఇరాన్‌తో) లేదా ‘రూపాయి-దిర్హామ్’ (యూఏఈతో) వంటి స్థానిక కరెన్సీ ఒప్పందాలు చేసుకునే దిశగా చర్యలు చేపట్టాలి. ఇది జరిగితే మనకు డాలర్ లేదా యువాన్ రెండింటితోనూ పని లేకుండా సొంత కరెన్సీతోనే వ్యాపారం చేసుకునే వీలుంటుంది. దీనివల్ల విదేశీ మారక నిల్వలు ఆదా అవుతాయి. డాలర్‌పై ఆధారపడటం తగ్గుతుంది. డాలర్ విలువ పెరిగినప్పుడు మనపై పడే అదనపు భారం తగ్గుతుంది.

వ్యూహాత్మక జాగ్రత్త అవసరం

హర్మూజ్‌ జలసంధి మూతబడితే ప్రపంచ చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో భారత్ తన వ్యూహాత్మక నిల్వలను కాపాడుకుంటూనే చమురు చెల్లింపుల కోసం బహుళ కరెన్సీ విధానాన్ని అనుసరించడం అత్యవసరం. డాలర్ ఆధిపత్యం తగ్గడం భారత్‌కు ఒక రకంగా అవకాశమే అయినా యుద్ధం తెచ్చే ద్రవ్యోల్బణ సెగను తట్టుకోవడం రూపాయికి అతిపెద్ద సవాలు.

ఇదీ చదవండి: ప్రకృతి వ్యవసాయం.. అనివార్యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement