అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో తీవ్ర అలజడి నడుస్తున్న నేపథ్యంలో, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత, ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత రాబర్ట్ కియోసాకి మరోసారి సంచలన హెచ్చరిక జారీ చేశారు. త్వరలోనే చరిత్రలోనే అతిపెద్ద ఆస్తుల బుడగ (బబుల్ బస్ట్) పగిలిపోతుందని, దాని తర్వాత బంగారం, వెండి, బిట్కాయిన్, ఈథేరియం ధరలు ఆకాశాన్ని తాకుతాయని ఆయన పేర్కొన్నారు.
కియోసాకి తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసిన తాజా సందేశంలో, "బబుల్ పగిలే 'పిన్' ఏదైనా ఈవెంట్ త్వరలోనే జరగనుంది. అది ఏ సంఘటన అయినా.. ఇప్పుడే బిట్కాయిన్, బంగారం, వెండి, ఈథేరియం ఎక్కువగా సేకరించాలి" అని సూచించారు. క్రాష్ తర్వాత ఒక సంవత్సరంలో బంగారం ఒక ఔన్స్కు 35,000 డాలర్లు, వెండి 200 డాలర్లు, బిట్కాయిన్ ఒక్కో కాయిన్ 750,000 డాలర్లు, ఈథేరియం 95,000 డాలర్లకు చేరుతాయని ఆయన ధీమాగా అంచనా వేశారు.
"మీ లాభం అమ్మేటప్పుడు కాదు.. కొనేటప్పుడే వస్తుంది" అనే తన 'రిచ్ డాడ్' సూత్రాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు కొనుగోలు చేసి భవిష్యత్తులో ధనవంతులు కావాలని, లేకపోతే చాలామంది పేదలవుతారని హెచ్చరించారు. ప్రస్తుతం బిట్కాయిన్ ధర సుమారు 74,000–75,000 డాలర్ల మధ్య ఉండగా, ఈథేరియం 2,300–2,400 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతోంది.


