దుబాయ్లో భాగస్వామ్య వసతి (హౌస్ షేరింగ్/బెడ్ స్పేస్ రెంటల్స్)పై కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. దుబాయ్ పాలకుడు, యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మార్చి 11న ఈ మేరకు లా నెం. (4) ఆఫ్ 2026 జారీ చేశారు. భాగస్వామ్య వసతిని నియంత్రించి, నివాసుల హక్కులను కాపాడటం, సురక్షితమైన, ఆరోగ్యకరమైన జీవన పరిస్థితులను నిర్ధారించడం, అధిక జనసాంద్రతను నివారించడం, అక్రమ భవన మార్పులను అరికట్టడం ఈ చట్టం లక్ష్యాలు.
కీలక నిబంధనలు ఇవే..
ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా, యూనిట్ను భాగస్వామ్య వసతిగా కేటాయించాలంటే దుబాయ్ మున్సిపాలిటీ నుండి ముందస్తు అనుమతి (పర్మిట్) తీసుకోవాలి. అనుమతి లేకుంటే ఇది చట్టవిరుద్ధం.
అనుమతులు ఒక సంవత్సరం చెల్లుబాటు అవుతాయి. యజమాని అభ్యర్థన మేరకు రెండేళ్ల పర్మిట్ కూడా ఇవ్వవచ్చు. పునరుద్ధరణ కోసం గడువు ముగియడానికి కనీసం 30 రోజుల ముందు దరఖాస్తు చేయాలి.
భాగస్వామ్య యూనిట్లలో గరిష్ట ఆక్యుపెన్సీ లిమిట్, ప్రతి వ్యక్తికి కనీస స్థలం, అవసరమైన షేర్డ్ ఫెసిలిటీలు (వెంటిలేషన్, షేర్డ్ ఏరియాలు) నిర్ధారించాలి.
అద్దెదారులు లేదా ఇతరులు యూనిట్లో ఏ భాగాన్నైనా సబ్-లీజ్కు ఇవ్వకూడదు లేదా పార్టిషన్లు (తాత్కాలిక గోడలు) ఏర్పాటు చేయకూడదు – ఇది నిషేధం.
భాగస్వామ్య వసతి మార్కెట్పై ప్రత్యేక అద్దె సూచిక (రెంటల్ ఇండెక్స్) ఏర్పాటు చేస్తారు. ఇది సాధారణ అద్దె మార్కెట్ సూచిక నుండి వేరుగా ఉంటుంది.
భారీ జరిమానాలు
ఉల్లంఘనలకు 500 నుండి 500,000 దిర్హమ్ల వరకు జరిమానా విధిస్తారు. ఒక క్యాలెండర్ ఇయర్లో పదేపదే ఉల్లంఘనలు జరిగితే గరిష్టంగా 1 మిలియన్ దిర్హమ్లు (సుమారు రూ.2.25 కోట్లు) వరకు జరిమానా పడవచ్చు.
ఎందుకీ కొత్త చట్టం?
గతంలో దుబాయ్లో అక్రమ విభజనలు (పార్టిషన్లు), బెడ్ స్పేస్ రెంటల్స్ వల్ల అగ్నిప్రమాదాలు, భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు, గత జూలైలో దుబాయ్ మెరీనాలో అక్రమంగా పార్టీషన్ చేసిన ఒక భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ భవనంలో 3,800 మందికి పైగా జనం నివసిస్తున్నారు. ఇలాంటి పార్టీషన్ల కోసం ఉపయోగించే తాత్కాలిక గోడలతో (చెక్క లేదా జిప్సమ్ బోర్డులు) అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంటిలేషన్ కూడా సక్రమంగా ఉండదు. అత్యవసర నిష్క్రమణ మార్గాలకు ఆస్కారం ఉండదు.


