విద్యకు విశ్వ ‘భారతం’ | International student numbers in India to grow 8 per annually from 58000 base | Sakshi
Sakshi News home page

విద్యకు విశ్వ ‘భారతం’

Mar 11 2026 5:56 AM | Updated on Mar 11 2026 5:56 AM

International student numbers in India to grow 8 per annually from 58000 base

దక్షిణాసియా దేశాల నుంచి సగం మంది రాక 

కలిసి వస్తున్న తక్కువ వ్యయం, నాణ్యమైన విద్య

సాక్షి, స్పెషల్‌ డెస్క్: మన దేశంలో విద్యనభ్యసించే విదేశీ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దక్షిణాసియా నుంచి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు భారత్‌కు వస్తున్నారు. ఆఫ్రికా దేశాల నుంచి కూడా డిమాండ్‌ క్రమంగా పుంజుకుంటోంది. స్టడీ ఇన్‌ ఇండియా కార్యక్రమం, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ 2020 వంటి విధాన సంస్కరణలే ఈ వృద్ధికి దోహదం చేస్తున్నాయి. అయితే మౌలిక సదుపాయాలు, గుర్తింపు, ఉపాధి అవకాశాలతో ముడిపడిన సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. 

2025లో వివిధ దేశాలకు చెందిన 58,000 మంది విద్యార్థులు భారత్‌లో చదువుతున్నట్టు అంచనా. మన దేశంలోని విద్యా సంస్థల్లో చేరే ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌ సంఖ్య 2030 వరకు ఏటా సుమారు 8% పెరుగుతుందని అంతర్జాతీయంగా ఉన్నత విద్య సమాచారం, ర్యాంకింగ్స్‌ను అందించే లండన్‌కు చెందిన క్యూఎస్‌ తన ‘క్యూఎస్‌ గ్లోబల్‌ స్టూడెంట్‌ ఫ్లోస్‌: ఇండియా 2026’నివేదికలో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న విద్యా గమ్యస్థానాలలో ఒకటిగా భారత్‌ నిలుస్తుందని వెల్లడించింది.  

భారత్‌కు కొత్త అవకాశాలు.. 
పదేళ్లలో భారత్‌కు వచ్చే అంతర్జాతీయ వి ద్యార్థుల సంఖ్య పెరగడానికి దేశీయంగా ప్ర భుత్వ విధాన సంస్కరణలు, దక్షిణాసియా –ఆఫ్రికా నుంచి పెరుగుతున్న డిమాండ్, సంప్రదాయ విదేశీ విద్యా గమ్యస్థానాలలో విపరీతంగా పెరుగుతున్న ఖర్చులు ప్రధాన కారణం. భారత్‌ను గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 2047 నాటికి 5 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం తెలి సిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా నాణ్యమై న విద్య కోసం అధికం అవుతున్న డిమాండ్‌ భారత్‌కు కొత్త అవకాశాలను కలి్పస్తోంది. 

వీసా నిబంధనలతో.. 
ఆంగ్లం మాట్లాడే విద్యా గమ్యస్థానాలైన అమెరికా, యూకే, కెనడా, ఆ్రస్టేలియా వంటి దేశాలు ఇటీవల వీసా నిబంధనలను కఠినతరం చేయడం, అక్కడ ట్యూషన్‌ ఫీజులు, జీవన వ్యయాలు విపరీతంగా పెరగడం వల్ల ప్రపంచ విద్యా రంగంలో మార్పులు వస్తున్నాయి. దీంతో చాలా మంది విద్యా ర్థులు తక్కువ ఖర్చుతో కూడిన, సులభంగా ప్రవేశం లభించే విద్యా కేంద్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. భారత్‌లో విద్యా వ్యయం తక్కువగా ఉండడం, విస్తరిస్తున్న ఉన్నత విద్యా వ్యవస్థ విదేశీ విద్యార్థులకు ప్రధాన ఆకర్షణలుగా మారుతున్నాయి. 

ఆఫ్రికా దేశాల నుంచి.. 
పెరుగుతున్న ఆదరణ: దక్షిణాసియా తర్వాత ఆఫ్రికా దేశాల నుంచి ప్రధానంగా సబ్‌–సహారన్‌ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 
  వృద్ధి రేటు: విద్యార్థుల రాక ఏటా 6% వృద్ధి చెందుతుందని అంచనా. ఈ దేశాల్లో యువత ఎక్కువ. ఉన్నత విద్యకు పరిమితమైన అవకాశాలు.  
⇒  జింబాబ్వే: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌. 2024లో భారత్‌కు విద్యార్థులను పంపిన దేశాల్లో 7వ స్థానం. 2030 నాటికి 6వ స్థానానికి చేరుకుంటుందని అంచనా. 

మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా.. 
⇒  స్థిరమైన సహకారం: ఈప్రాంతం నుంచి విద్యార్థుల రాక స్థిరంగా కొనసాగుతోంది. 
⇒ యూఏఈ: 2030 నాటికి భారత్‌లోని మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో 5% వరకు ఉండే అవకాశం.

ఆకర్షణీయమైన అంశాలు..
⇒  భౌగోళిక సామీప్యత: పొరుగు దేశాలకు దగ్గరగా ఉండటం వల్ల ప్రయా ణ సౌలభ్యం మెరుగ్గా ఉండటం. 
⇒  సాంస్కృతిక సారూప్యత: ఆహారం, జీవనశైలి, భాషాపరంగా ఉన్న దగ్గరి సంబంధాలు విద్యార్థులకు సౌకర్యవంతంగా అనిపించడం. 
⇒  తక్కువ ఖర్చు: ఇతర దేశాలతో పోలిస్తే విద్యా, జీవన వ్యయాలు చాలా తక్కువగా ఉండటం. 

⇒  ప్రధాన సమస్య: భారతీయ విద్యా సంస్థల విషయంలో కంపెనీల దృష్టిలో గుర్తింపు, విద్యాపరమైన గుర్తింపు మధ్య పెద్ద వ్యత్యాసం. 
⇒  మెరుగుపడిన ఎంప్లాయర్‌ ర్యాంకింగ్‌: గత దశాబ్దంలో భారతీయ గ్రాడ్యుయేట్లపై కంపెనీలకు ఉన్న నమ్మకం, గుర్తింపు గణనీయంగా పెరిగింది. 
⇒  స్థిరంగా ఉన్న అకడమిక్‌ సూచీలు: విద్యా నాణ్యత, పరిశోధనలు, అంతర్జాతీయ విద్యా ప్రమాణాల పరంగా ఉండే గుర్తింపులో మాత్రం పెద్దగా మార్పు లేదు.

భారత్‌లో చదువుతున్న మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో దక్షిణాసియా దేశాలు దాదాపు సగానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా నేపాల్, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చే విద్యార్థులు మొత్తం ప్రవేశాలలో 30% కంటే ఎక్కువ. రాబోయే కాలంలో కూడా ఈ ప్రాంతం నుంచి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా నేపాల్‌ కొనసాగుతుందని అంచనా.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement