ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ ఉత్పత్తికి తొలి ప్రాధాన్యం
వాటికే మొదట సహజ వాయువు సరఫరా
ఎరువుల తయారీకి ఆరు నెలల సగటులో 70 శాతం సరఫరా
పారిశ్రామిక వినియోగదారులకు 80%
గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు, సహజ వాయువు దిగుమతుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. దేశంలో వంట గ్యాస్ సరఫరా తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గృహ వినియోగానికి ప్రస్తుతం ఇబ్బందులు లేకపోయినా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా తగినంత లేకపోవడంతో ప్రధాన నగరాల్లో హోటళ్లు మూతపడుతున్నాయి. రవాణా రంగానికి అవసరమైన గ్యాస్ సరఫరా నిలిచిపోతోంది.
సమస్య పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజ వాయువును ప్రాధాన్యతా క్రమంలో సరఫరా చేయాలని ఆదేశించింది. మొదట ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ తయారీకి, తర్వాత ఎరువుల ఉత్పత్తికి, అనంతరం తేయాకు పరిశ్రమ, పారిశ్రామిక వినియోగదారులకు, ఆ తర్వాత సిటీ గ్యాస్ సరఫరాదారులకు సహజ వాయువును సరఫరా చేయాలని పేర్కొంది. ఈ మేరకు సోమవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గ్యాస్ను మొదట ద్రవీకృత పెట్రోలియం గ్యాస్(ఎలీ్పజీ), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) తయారీకి అందజేయాలని తేలి్చచెప్పింది.
పారిశ్రామిక వినియోగదారులకు 80%
ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ ఉత్పత్తిలో సహజ వాయువును ముడి సరుకుగా ఉపయోగిస్తారు. ముడి చమురు శుద్ధి ప్రక్రియలో ఒక ఉపఉత్పత్తి ఎల్పీజీ. అలాగే సహజ వాయువును ప్రాసెస్ చేయడం ద్వారా ఎల్పీజీని తయారు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. మొదట ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ తయారీకి ప్రాధాన్యం ఇస్తూ సహజ వాయువును సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆయా రంగాల్లో గత ఆరునెలల సగటు వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని అందులో 100 శాతం సరఫరా చేయాలి. ఈ మూడు రంగాల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూనే ఎరువుల తయారీ, తేయాకు పరిశ్రమతోపాటు ఇతర పారిశ్రామిక వినియోగానికి గ్యాస్ అందజేయాలి.
ఎరువుల తయారీ రంగానికి గత ఆరు నెలల సగటు డిమాండ్లో కనీసం 70 శాతం సరఫరా చేయాలి. ఇక తేయాకు పరిశ్రమ, ఉత్పత్తి, పారిశ్రామిక వినియోగదారులకు గత ఆరు నెలల సగటు డిమాండ్లో 80 శాతం సహజ వాయువు అందజేయాలి. పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేసే సిటీ గ్యాస్ సరఫరాదారులకు(సీజీడీ) ఆరు నెలల సగటు డిమాండ్లో 80 శాతం ఇవ్వొచ్చు. దేశీయంగా నిత్యం 191 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు అవసరం. దేశంలో రోజువారీ మొత్తం అవసరాల్లో సగం దేశీయ సహజ వాయువే తీరుస్తోంది. పెట్రోకెమికల్ ప్లాంట్లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఈ గ్యాస్ను సరఫరా చేయకుండా నియంత్రణ విధించారు.
మూసివేత దిశగా హోటళ్లు
వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత హోటళ్లు, రెస్టారెంట్లపై పెను ప్రభావం చూపుతోంది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఆహారశాలలు మూతపడుతున్నాయి. ముంబై, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్, ఔరంగాబాద్, నాగపూర్, ఢిల్లీ వంటి నగరాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే వందలాది హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. రానున్న రెండు రోజుల్లో పరిస్థితి ఇంకా తీవ్రమయ్యే అవకాశాలున్నాయని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ఆర్ఏఐ) అధ్యక్షుడు సాగర్ దర్యానీ మంగళవారం చెప్పారు. పశ్చి మాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోయినట్లు తెలియజేశారు.
ఎల్పీజీ ఉత్పత్తి 10% పెంపు
దేశంలో ఎల్పీజీ సంక్షోభం లేదని, ఎవరూ ఆందోళన చెందొద్దని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టంచేసింది. తమ ఆదేశాల మేరకు చమురు శుద్ధి కంపెనీలు ఎల్పీజీ ఉత్పత్తిని 10 శాతం పెంచాయని వెల్లడించింది. రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నాయని తెలిపింది. వంట గ్యాస్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, ప్రజలెవరూ నమ్మొద్దని కోరింది. ఎల్పీజీ సరఫరా స్థిరంగా కొనసాగుతున్నట్లు వెల్లడించింది. గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా, అవకతవకలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని(ఎస్మా) అమలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి.
మన ప్రజలు ఇబ్బంది పడొద్దు
⇒ చమురు, గ్యాస్ సరఫరా, ధరల విషయంలో సమన్వయంతో పనిచేయండి
⇒ కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ ఆదేశం
న్యూఢిల్లీ: పశ్చి మాసియా సంక్షోభం, తద్వారా దేశంలో చమురు, వంట గ్యాస్ సరఫరాలో ఆటంకాలు ఎదురవుతుండడంపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. పశ్చి మాసియా యుద్దం వల్ల పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, ధరల విషయంలో మన దేశ ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిదాడులు, హొర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి.
ఈ ప్రభావం మన వినియోగదారులపై పడకుండా చూడాలని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. అంతేకాకుండా చమురు, వంట గ్యాస్ కొరత లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ధరలు పెరుగుతున్న తీరుపైనా ప్రధానమంత్రి సమీక్షించారు. పశ్చి మాసియా నుంచి చమురు సరఫరా తగ్గడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రష్యా, అమెరికా, వెనెజువెలా, ఆ్రస్టేలియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపాయి.


