అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్ల పెరుగుదలతో ఇంధనాల కొనుగోలు కోసం భారత్ ప్రతి నెలా 7–8 బిలియన్ డాలర్ల మేర అదనంగా విదేశీ కరెన్సీని వెచ్చించాల్సి రానుందని విశ్లేషకులు తెలిపారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ముందు 66 డాలర్లుగా ఉన్న ధర దాదాపు 120 బిలియన్ డాలర్లకు ఎగిసిందని, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) రేట్లు దాదాపు రెట్టింపై యూనిట్కి (ఎంబీటీయూ) 24–25 డాలర్లకు చేరాయని పేర్కొన్నారు. ఇలా ఇంధనాల రేట్లు ఎగియడం వల్ల రవాణా, తయారీ, ఆహారోత్పత్తులు, కమోడిటీల ధరలన్నీ పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేఠి చెప్పారు.
భారీ రేట్లు కొనసాగే వ్యవధి, డిమాండ్, పాలసీపరమైన చర్యలను బట్టి ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఇక క్రూడ్ రేటు సగటున 10 డాలర్లు పెరిగితే కరెంటు అకౌంటు లోటు (క్యాడ్) 30–40 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ చెప్పారు. ముడిచమురు ధర సగటున 100–105 డాలర్లుగా ఉంటే జీడీపీలో క్యాడ్ 1.9–2.2 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు.
క్రూడాయిల్ ధరలు 10 శాతం పెరిగితే టోకు ద్రవ్యోల్బణం 80–100 బేసిస్ పాయింట్లు, వినియోగదారుల ద్రవ్యోల్బణం 40–60 బేసిస్ పాయింట్లు పెరగొచ్చని ఇక్రా అంచనా వేసింది. దేశీయ అవసరాలకు సంబంధించి భారత్ 85 శాతం క్రూడాయిల్ను దిగుమతి చేసుకొంటుండగా, ప్రతి రోజూ 50 లక్షల బ్యారెళ్ల ఆయిల్ వినియోగం ఉంటోంది.
ఐఈఏకి ఇండియా నో..
ఆయిల్ ధరలకి కళ్లెం వేసేందుకు వివిధ దేశాలు వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేసేలా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) చేపట్టిన కార్యక్రమంలో భారత్ భాగం కాబోదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సంక్షోభాన్ని సృష్టించిన వారిపైనే, పరిస్థితులను చక్కదిద్దాల్సిన బాధ్యత కూడా ఉందనేది ప్రభుత్వ అభిప్రాయమని పేర్కొన్నాయి.
దేశీయంగా 5.33 మిలియన్ టన్నుల ఆయిల్ని నిల్వ చేశారు. సరఫరాపరమైన సవాళ్లు తలెత్తితే, వాటిని ముందుగా దేశీయంగా ప్రజల అవసరాల కోసమే వినియోగించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. 2021లో అమెరికా సారథ్యంలో ఇలాంటి కార్యక్రమమే చేపట్టినప్పుడు భారత్ 5 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ను విడుదల చేసింది.


