ప్రపంచ ఇంధన మార్కెట్లలో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో దేశీయంగా వంటగ్యాస్ సరఫరా అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రకటించింది. గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న తన రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ సముదాయాల్లో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) ఉత్పత్తిని పెంచుతున్నట్లు మంగళవారం వెల్లడించింది.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఇంధన మార్కెట్లు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ కీలక ఇంధనాలకు నిరంతర సరఫరా కొనసాగడం జాతీయ ప్రాధాన్యతగా ఉందని పేర్కొంది.
అలాగే కేజీ-డీ6 బేసిన్ నుంచి ఉత్పత్తి అయ్యే సహజవాయువును ప్రాధాన్య రంగాలకు మళ్లించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. జాతీయ ఇంధన అవసరాలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
“భారతదేశ ఇంధన భద్రత, కోట్లాది భారతీయ కుటుంబాల సంక్షేమం మా సంస్థకు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తూ జాతీయ మార్గదర్శకాలకు పూర్తిగా కట్టుబడి ఉంటాం. అవసరమైన రంగాలకు ఇంధన సరఫరా నిరంతరం అందేలా చర్యలు కొనసాగిస్తాం” అని కంపెనీ తెలిపింది. అవసరమైన సమయంలో దేశానికి అండగా నిలబడటం రిలయన్స్ బాధ్యతగా భావిస్తుందని కూడా పేర్కొంది. ప్రపంచ అనిశ్చిత పరిస్థితుల్లో దేశ ఇంధన భద్రతకు మద్దతుగా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా దేశంలోని అన్ని రిఫైనరీలు ప్రొపేన్, బ్యూటేన్, ప్రొపైలిన్, బ్యూటెన్స్ వంటి సి3, సి4 స్ట్రీమ్లను పూర్తిగా ఎల్పీజీ ఉత్పత్తికి వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అదనంగా ఉత్పత్తి అయ్యే వంటగ్యాస్ను దేశీయ వినియోగదారులకు మాత్రమే అందించాలని స్పష్టం చేసింది.
ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే నిత్యావసర వస్తువుల చట్టం–1955చ పెట్రోలియం ఉత్పత్తుల (ఉత్పత్తి, నిల్వ, సరఫరా నిర్వహణ) ఆర్డర్–1999 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.


