నేటినుంచే అమల్లోకి ∙చెన్నైలోనూ ఇదే పరిస్థితి?
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో హోటళ్లకు ఎల్పీజీ షాక్ తగిలింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో మంగళవారం నుంచి నగరమంతటా హోటళ్లు మూతబడనున్నాయి. బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ సోమవారం ఒక ప్రకటనలో ఈ మేరకు పేర్కొంది. ‘‘ఎల్పీజీ లేకుండా హోటళ్లను నడపడం అసాధ్యమని అందరికీ తెలుసు.
అందుకే మాకిష్టం లేకపోయినా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు’’అని అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పి.సి.రావు విలేకరులకు తెలిపారు. కేంద్రం తక్షణం ఈ సమస్యపై దృష్టి పెట్టి పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. బెంగళూరుకు చెందిన పలువురు ఎంపీల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లామన్నారు. హోటళ్లకు పరిమిత స్థాయిలోనైనా ఎల్పీజీ సరఫరాలు కొనసాగేలా చూడాలని కోరారు. ఎల్పీజీ కొరతపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆందోళన వెలిబుచ్చారు. మరోవైపు చెన్నైలో కూడా బెంగళూరు తరహా పరిస్థితే నెలకొన్నట్టు వార్తలొస్తున్నాయి.


