పశ్చిమాసియా కల్లోలంపై కేంద్రం
మన ఇంధన భద్రతపై రాజీ లేదు
పార్లమెంటులో జైశంకర్ ప్రకటన
సంక్షోభానికి చర్చలే పరిష్కారం
ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాకు విదేశాంగ మంత్రి సూచన
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా తక్షణం ఉద్రిక్తతలకు తెర దించాలని సూచించింది. దేశాల సార్వభౌమాధికారాలను గౌరవించాలని అభిప్రాయపడింది. పశ్చిమాసియా ప్రాంతంలోని దాదాపు కోటి మంది భారతీయుల భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసింది. దేశ ఇంధన భద్రత, వర్తక, భద్రత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తామని పేర్కొంది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో ఈ మేరకు ప్రకటన చేశారు.
పశ్చిమాసియాలో పరిస్థితిని కేంద్రం నిరంతరం సమీక్షిస్తోందని చెప్పారు. ఇప్పటిదాకా 67 వేల మంది విద్యార్థులను సురక్షితంగా భారత్కు తీసుకొచ్చినట్టు వివరించారు. పశ్చిమాసియాలోని భారతీయుల భద్రత నిమిత్తం అక్కడి దేశాధినేతలతో ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పలుమార్లు మాట్లాడారని గుర్తు చేశారు. ‘‘మన ఇంధన భద్రతపై ఆందోళన అనవసరం. ఈ విషయంలో మన వినియోగదారుల ప్రయోజనాలే పరమావధి. వాటిని కాపాడే దిశగా కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటోంది’’అని తెలిపారు. ‘‘మన ఇంధన భద్రతకు, వర్తకానికి గల్ఫ్ ప్రాంతం కీలకం. ఆ ప్రాంతంతో ఏటా 200 బిలియన్ డాలర్ల మేరకు వాణిజ్యం జరుగుతోంది’’అని గుర్తు చేశారు.
నౌకలకు ఆశ్రయం కోరిన ఇరాన్
ఇరాన్కు చెందిన నౌక భారత్లో ఆశ్రయం పొందేందుకు మానవతా కోణంలో అనుమతించినట్టు జైశంకర్ వెల్లడించారు. ‘‘మూడు నౌకలకు ఇరాన్ ఆశ్రయం కోరింది. ఈ మేరకు ఫిబ్రవరి 28న విజ్ఞప్తి చేసింది. కేంద్రం మార్చి 1న అనుమతులు జారీ చేసింది. ఐఆర్ఐఎస్ లావన్ నౌక మాత్రమే మార్చి 4న కోచిలో లంగరు వేసింది’’అని చెప్పారు. మిగతా రెండు నౌకల్లో ఐఆర్ఐఎస్ దేనాను మార్చి 4న శ్రీలంక తీరంలో అమెరికా ముంచేయడం తెలిసిందే. అనంతరం మూడో నౌక ఐఆర్ఐఎస్ బుషెర్ శ్రీలంకలోని ట్రింకోమలీ రేవులో లంగరు వేసింది.
చర్చకు ఖర్గే డిమాండ్
జైశంకర్ ప్రకటనపై ఉభయ సభల్లోనూ విపక్ష సభ్యులు పెద్దపెట్టున నిరసనలకు దిగారు. ప్రకటనకు ముందే పశ్చిమాసియా సంక్షోభంపై పూర్తిస్థాయి చర్చకు పట్టుబట్టారు. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ దేశ ఇంధన భద్రతపై స్వల్ప అవధి చర్చకు డిమాండ్ చేశారు. వంట గ్యాస్ ధర పెంపు సామాన్యునిపై భారం మోపిందని ఆయన విమర్శించారు.
‘‘పశ్చిమాసియా కల్లోలం తాలూకు ప్రభావం భారత ఇంధన భద్రతతో పాటు ఆర్థిక స్థిరత్వంపైనా పడుతోంది. దేశ ఇమేజీని, ప్రతిష్టను కూడా ఆ యుద్ధం ప్రభావితం చేస్తోంది. కనుక ఈ అంశంపై 176వ నిబంధన కింద చర్చ చేపట్టాలి’’అని కోరుతూ నోటీసిచ్చారు. దాన్ని పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని చైర్మన్ సి.పి.రాధాకృష్ణన్ వెల్లడించారు. అనంతరం జైశంకర్ ప్రకటన చేసేందుకు అనుమతించారు. అందుకు విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ వాకౌట్ చేశారు. మంత్రి ప్రకటన చేస్తుండగానే వాకౌట్ చేయడాన్ని సభా నాయకుడు జె.పి.నడ్డా తీవ్రంగా తప్పుబట్టారు. సభలో అరాచక పరిస్థితులు సృష్టించేందుకు కాంగ్రెస్, విపక్షాలు ప్రయతి్నస్తున్నాయంటూ మండిపడ్డారు.


