పాట్నా: బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజ్యసభలో అడుగు పెట్టనున్న తరుణంలో ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ జేడీయూలో చేరారు. ఆదివారం నితీష్ ఆధ్వర్యంలో నిశాంత్ పార్టీ సభ్యత్వం పొందారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ తన కుమారుడికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
రెండు దశాబ్దాలకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించిన నితీష్ కుమార్ త్వరలో రాజ్యసభకు వెళ్లనున్నారు. ఆయన నిర్ణయంతో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న నిశాంత్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. త్వరలో బిహార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది.
బిహార్లో అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ‘సుశాషన్ బాబు’ (మంచి పాలన అందించే వ్యక్తి) అనే పేరు తెచ్చుకున్న నితీష్ మార్చి 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు. త్వరలో ముఖ్యమంత్రి పదవిని వదులుకోనున్నారు.


