పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడంపై జేడీయూ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నితీశ్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతున్నారు. పట్నాలోని జేడీయూ పార్టీ కార్యాలయం ఎదుట పోస్టర్లు పెట్టి మరీ నితీశ్ కుమార్కు కార్యకర్తలు విజ్ఞప్తులు చేశారు.
ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ, ప్రజాస్వామ్యంలో ఆత్మగౌరవాన్ని తక్కువ చేయడాన్ని ఇక సహించబోమని పేర్కొన్నారు. ఇన్నాళ్లు నితీశ్ కుమార్కు మద్దతు తెలిపిన వారే ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోస్టర్లు సైతం పెడుతుండడం గమనార్హం.

కాగా, నితీశ్ కుమార్ గురువారం రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఆ సమయంలో ఆయన వెంటే ఉన్నారు. బిహార్లో బీజేపీ నేత ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరుగుతోంది. దీనిపై విపక్షాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.
బీజేపీపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. నితీశ్పై బీజేపీ కుయుక్తులు చేసిందని, ‘2025 సే 30 ఫిర్ సే నితీశ్’ అనే ఎన్నికల నినాదానికి విరుద్ధంగా వ్యవహరించిందని చెప్పారు. నితీశ్ సీఎం కుర్చీలో 6 నెలలకంటే ఎక్కువ ఉండరని తాము ముందే చెప్పామని అన్నారు.
మరోవైపు, నితీశ్ కుమార్ మళ్లీ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఆయన సీఎంగా పదవిలో ఉన్న కాలాన్ని బిహార్ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా పేర్కొన్నారు. ఎన్నో పదవుల్లో నితీశ్ కుమార్ సుదీర్ఘ రాజకీయ జీవితం కొనసాగించినా ఆయనపై ఏ మచ్చా పడలేదని అమిత్ షా అన్నారు.


