ఎస్‌యూవీలపై మారుతీ సుజుకీ ఫోకస్‌ | Maruti Suzuki to Launch 7 New SUVs in India as Segment Share Surges | Sakshi
Sakshi News home page

ఎస్‌యూవీలపై మారుతీ సుజుకీ ఫోకస్‌

Mar 19 2026 8:41 AM | Updated on Mar 19 2026 11:46 AM

Maruti Suzuki to Launch 7 New SUVs in India as Segment Share Surges

వచ్చే 5–6 ఏళ్లలో 7 కొత్త మోడళ్లు

40 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి లక్ష్యం

ఇన్వెస్టర్ల ప్రజెంటేషన్‌లో ఎండీ హిశాషి టెకుచి 

దేశీయ ప్యాసింజర్‌ వాహన మార్కెట్లో శరవేగంగా విస్తరిస్తున్న స్పోర్ట్‌ యుటిలిటీ వెహికల్‌ (ఎస్‌యూవీ) విభాగంపై మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌  దృష్టి సారించింది. ఇందులో భాగంగా వచ్చే 5–6 ఏళ్లలో 7 కొత్త ఎస్‌యూవీ మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తున్నట్లు ఎండీ హిశాషి టెకుచి తెలిపారు. ఇన్వెస్టర్ల ప్రజెంటేషన్‌లో ఆయన మాట్లాడుతూ, భారతీయ వాహన మార్కెట్‌లో ఎస్‌యూవీల వాటా వేగంగా పెరుగుతోందన్నారు. 2019లో 26.5 శాతంగా ఉన్న ఎస్‌యూవీ వాటా 2024 నాటికి 54.7 శాతానికి చేరిందన్నారు.

అదే విధంగా, కంపెనీ ఎస్‌యూవీ మార్కెట్‌ వాటా 2019–20 ఆర్థిక సంవత్సరంలో 16.8 శాతం ఉండగా, 2025–26 కాలంలో 19.6 శాతానికి పెరిగిందని తెలిపారు. గత నాలుగేళ్లలో ఈ విటారా, విక్టోరిస్, జిమ్నీ, ఫ్రాంక్స్, గ్రాండ్‌ విటారా వంటి మోడళ్లను విడుదల చేయడంతో పాటు బ్రెజ్జా మోడల్‌ను పూర్తిగా ఆధునీకరించడం ద్వారా ఈ వృద్ధి సాధ్యమైందన్నారు. వినియోగదారుల అభిరుచుల్లో మార్పులను దృష్టిలో ఉంచుకుని మధ్యస్థ, భారీ ఎస్‌యూవీ/ఎంపీవీ మోడళ్ల శ్రేణిని విస్తరించనున్నట్లు తెలిపారు. అలాగే మిడ్‌–ఎస్‌యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు. తొలిసారి కార్లు కొనుగోలు చేసే వినియోగదారులను ఆకర్షించేందుకు ‘‘సుజుకికి ప్రత్యేకమైన’’ ఎంట్రీ లెవల్‌ కారును ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.  

గ్లోబల్‌ తయారీ కేంద్రంగా భారత్‌

‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమం ద్వారా ఆటోమొబైళ్లు, ద్విచక్ర వాహనాల తయారీలో భారత్‌ను గ్లోబల్‌ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న పేరెంట్‌ సంస్థ సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ లక్ష్యాన్ని టెకుచి పునరుద్ఘాటించారు. దేశీయ డిమాండ్‌ను తీర్చడంతో పాటు భారత్‌ను గ్లోబల్‌ ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేయడానికి వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని సుమారు 40 లక్షల యూనిట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మార్కెట్‌ పరిస్థితులను గమనిస్తూ, తగిన సమయంలో దశలవారీగా ఈ సామర్థ్యాన్ని పెంచుతామని పేర్కొన్నారు. కార్బన్‌ న్యూట్రాలిటీ లక్ష్యాల సాధనలో భాగంగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్‌ వాహనాలతో పాటు సీఎన్‌జీ, బయోఫ్యూయెల్‌ వంటి బహుళ ఇంధన విధానాలను అనుసరించనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!

Advertisement
 
Advertisement
Advertisement