దేశంలోని ప్రతి పౌరుడికీ ఆరోగ్య బీమా రక్షణ కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. 2033 నాటికి దేశ ప్రజలందరికీ ఆరోగ్య బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈమేరకు పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో బీమా రంగంపై అడిగిన ప్రశ్నలకు ఆమె వివరణ ఇచ్చారు.
గ్రామ పంచాయతీలే ప్రామాణికం
గ్రామీణ భారతంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంటూ మంత్రి కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా 25,000 గ్రామ పంచాయతీలను కవర్ చేసేలా భారీ ‘రూరల్ అవుట్రీచ్’ ప్రణాళికను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) 2024లో కొత్త నిబంధనలను నోటిఫై చేసిందని గుర్తు చేశారు. దీని ప్రకారం, బీమా కవరేజీ, గ్రామీణ బాధ్యతలను కొలవడానికి ఇకపై గ్రామ పంచాయతీనే ప్రాథమిక యూనిట్గా పరిగణిస్తారు. ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్లో బీమా పొందడం (Insurance Penetration) తక్కువగా ఉందని మంత్రి అంగీకరించారు.
ఆరోగ్య బీమా మార్కెట్ దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోందని మంత్రి గణాంకాలతో వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం రూ.1,17,505 కోట్ల ప్రీమియం నమోదు చేసింది. వివిధ పథకాల ద్వారా ప్రస్తుతం దేశంలో 58 కోట్ల మందికి ఆరోగ్య బీమా రక్షణ లభిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ మద్దతు గల బీమా సంస్థలు సమన్వయంతో కవరేజీని విస్తరిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.
పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన
పేద, బలహీన వర్గాలకు బీమాను చేరువ చేసేందుకు ప్రీమియం రేట్లను అత్యంత సరసమైన ధరల్లో ఉంచడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి నొక్కి చెప్పారు. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన సాధించిన విజయాన్ని ఆమె ఉదహరించారు. ‘కేవలం రూ.436 వార్షిక ప్రీమియంతో రూ.2 లక్షల జీవిత బీమా కవరేజీని ఈ పథకం అందిస్తోంది. ఇప్పటివరకు ఇందులో 26.79 కోట్ల మంది నమోదు చేసుకోవడం సామాజిక భద్రతపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహనకు నిదర్శనం’ అని ఆర్థిక మంత్రి తెలిపారు.
సామాజిక రక్షణే పరమావధి
కేంద్రం తీసుకుంటున్న ఈ బహుళ విధాన చర్యలు కేవలం బీమా రంగాన్ని వృద్ధి చేయడమే కాకుండా ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక, సామాజిక రక్షణ కవచాన్ని నిర్ధారించడానికి దోహదపడతాయని ఆర్థిక మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!


