దేశంలో రైలు టికెట్ బుకింగ్ వ్యవస్థ త్వరలో మరింత వేగవంతం, సులభతరం కానుంది. ముఖ్యంగా తత్కాల్ టికెట్లు బుక్ చేసే సమయంలో ఎదురయ్యే ఆలస్యం, సర్వర్ సమస్యలు, లావాదేవీ వైఫల్యాలకు చెక్ పెట్టేలా రైల్వే శాఖ భారీ అప్గ్రేడ్ పనులు చేపట్టింది.
జూన్ నాటికి కొత్త వ్యవస్థ సిద్ధం!
అధికారుల ప్రకారం.. అప్గ్రేడ్ చేసిన ప్రయాణీకుల రిజర్వేషన్ వ్యవస్థ జూన్ నాటికి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం నిమిషానికి సుమారు 32,000 టికెట్లు మాత్రమే బుక్ చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యవస్థ, అప్గ్రేడ్ తర్వాత నిమిషానికి 1.5 లక్షల బుకింగ్స్ను నిర్వహించగలదు. దీంతో పీక్ టైమ్లో కూడా సాఫీగా టికెట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది.
ఎంక్వైరీ సేవల్లోనూ వేగం
టికెట్ బుకింగ్ మాత్రమే కాకుండా, రైలు వివరాలు, సీట్ల లభ్యత తెలుసుకునే ఎంక్వైరీ సేవలు కూడా మరింత వేగవంతం కానున్నాయి. ప్రస్తుతం నిమిషానికి 4 లక్షల విచారణలను నిర్వహిస్తున్న వ్యవస్థ, అప్గ్రేడ్ తర్వాత ఇంకా అధిక సామర్థ్యంతో పని చేయనుంది.
సాంకేతిక సమస్యలకు చెక్
ప్రస్తుతం వినియోగదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు సర్వర్ క్రాష్లు, స్లో స్పీడ్, పేమెంట్ ఫెయిల్యూర్స్. కొత్త వ్యవస్థతో ఈ సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీంతో ముఖ్యంగా రద్దీ సమయాల్లో కన్ఫర్మ్ టికెట్ పొందడం సులభమవుతుంది.
కొత్త ఫీచర్లు
అప్గ్రేడ్ వ్యవస్థలో పలు కొత్త ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. వివిధ తేదీలలో టికెట్ ధరలను ముందుగానే తెలుసుకునే ఫేర్ క్యాలెండర్, ప్రయాణికుడు స్వయంగా సీటు ఎంపిక చేసుకునే ఆప్షన్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రావచ్చు. అలాగే బహుభాషా సౌకర్యం కూడా కల్పించనున్నారు.
ఆన్లైన్ బుకింగ్కు పెరుగుతున్న ఆదరణ
ప్రస్తుతం రిజర్వేషన్ టికెట్లలో దాదాపు 89 శాతం ఆన్లైన్ ద్వారా బుక్ అవుతుండగా, కేవలం 11 శాతం మాత్రమే కౌంటర్లలో కొనుగోలు చేస్తున్నారు. రాబోయే మార్పులతో ఆన్లైన్ బుకింగ్ మరింత నమ్మదగినదిగా, యూజర్ ఫ్రెండ్లీగా మారనుంది. మొత్తంగా, ఈ అప్గ్రేడ్తో రైలు ప్రయాణికుల టికెట్ బుకింగ్ అనుభవం పూర్తిగా మారిపోనుంది.


