వెంటాడి కొడవలి, యాసిడ్‌తో దాడి.. నర్సుపై ఘాతుకం | Bengaluru Nurse chased attacked | Sakshi
Sakshi News home page

వెంటాడి కొడవలి, యాసిడ్‌తో దాడి.. నర్సుపై ఘాతుకం

Sep 17 2026 4:53 PM | Updated on Sep 17 2026 5:37 PM

 Bengaluru Nurse chased attacked

Representative image

బెంగళూరులోని జేపీ నగర్‌ 3వ దశలో గురువారం ఉదయం 26 ఏళ్ల ఓ నర్సుపై ఆమె భర్త దాడికి పాల్పడ్డాడు. దంపతుల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తెలిపారు. బాధితురాలిని మధుమితగా గుర్తించారు. కోల్‌కతాకు చెందిన ఆమె గత ఏడాదిన్నరగా అక్కడి ఓ ప్రైవేటు క్లినిక్‌లో నర్సుగా పనిచేస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం 9.15 గంటల సమయంలో మధుమిత అల్పాహారం కోసం క్లినిక్‌ నుంచి బయటకు వెళ్లారు. అదే సమయంలో ఆమె భర్త వెంకటేశన్‌ ఆమెను వెంబడిస్తూ క్లినిక్‌ ఉన్న బహుళ అంతస్తుల భవనం దిగువ అంతస్తులోని పార్కింగ్‌ ప్రాంతానికి చేరుకున్నాడు. తమిళనాడుకు చెందిన వెంకటేశన్‌ ద్విచక్రవాహనంపై కత్తి, కొడవలి, యాసిడ్‌ తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు.

పార్కింగ్‌ ప్రాంతంలో మధుమితపై వెంకటేశన్‌ కొడవలితో దాడి చేసి, అనంతరం ఆమెపై యాసిడ్‌ పోశాడని పోలీసులు చెప్పారు. తీవ్ర భయాందోళనకు గురైన ఆమె కేకలు వేస్తూ పరుగులు తీశారు. దీంతో క్లినిక్‌ సిబ్బంది, స్థానికులు ఆమెను కాపాడేందుకు అక్కడికి చేరుకున్నారు. కొందరు వ్యక్తులు నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారిపైనా అతడు దాడికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు.

ఇంతలో సమీపంలోని ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఘటనను గుర్తించారు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న వెంకటేశన్‌ను వారు అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన మధుమిత ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఘటనపై జేపీ నగర్‌ పోలీసులు స్థలాన్ని పరిశీలించి వెంకటేశన్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాడికి దారితీసిన ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు అతడిని ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement