సిద్ధరామయ్యకు ఇంతటి అవమానమా? | Siddaramaiah Statue Vanishes Overnight Ahead of DK Kalaburagi Visit | Sakshi
Sakshi News home page

సిద్ధరామయ్యకు ఇంతటి అవమానమా?

Sep 17 2026 12:51 PM | Updated on Sep 17 2026 1:22 PM

Siddaramaiah Statue Vanishes Overnight Ahead of DK Kalaburagi Visit

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఘోర అవమానం.. అదీ ఉద్దేశపూర్వకంగానే జరిగిందా?. కన్నడ నాట ఈ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. కలబురగిలోని సిద్ధరామయ్య సర్కిల్‌లో ఉన్న విగ్రహ తొలగింపు.. ఆయన వర్గీయులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కలబురగి పర్యటనకు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత ఆసక్తి రేపుతోంది.

ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఇవాళ కలబురగిలో పర్యటించాల్సి ఉంది. కల్యాణ కర్ణాటక ఉత్సవాల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే అంతకంటే ముందే.. ఈ ఉదయం అక్కడి చౌరస్తాలో ఏర్పాటు చేసిన సిద్ధరామయ్య కాంస్య విగ్రహాన్ని మున్సిపల్‌ సిబ్బంది తొలగించారు. అయితే సిద్దూ అభిమానుల నుంచి విమర్శలు రావడంతో.. డీకే పర్యటనకు, విగ్రహ తొలగింపునకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు వివరణ ఇచ్చుకున్నారు.  అనుమతి లేకుండా విగ్రహాన్ని పెట్టారని వివరణ ఇచ్చారు. అలాగే ఈ మొత్తం ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్‌ను బయటపెట్టారు.

మూడేళ్ల కిందట ఈ సర్కిల్‌కు కొందరు స్థానికులు సిద్ధరామయ్య అని పేరు పెట్టారు. అయితే అందుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు అంటున్నారు. అంతేకాదు.. తాము తొలగించిన విగ్రహం కూడా గత రాత్రే ఏర్పాటు చేశారని.. దానికి కూడా పర్మిషన్‌ లేదని చెబుతున్నారు. 

‘‘దాదాపు ఏడేనిమిది మంది వ్యక్తులు అర్ధరాత్రివేళ విగ్రహాన్ని తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. విగ్రహం చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేస్తున్నట్లుగా ఉంది. వాళ్ల ఉద్దేశం ఏంటో మాకు తెలియదు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాలని పోలీసులను కోరాం’’ అని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కాంక్రీట్‌ కూడా పూర్తిగా ఆరకముందే తమ సిబ్బంది అక్కడికి చేరుకుని వెంటనే విగ్రహాన్ని తొలగించినట్లు తెలిపారు.

2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య పోటీ నెలకొంది. చివరకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, శివకుమార్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఇద్దరూ రెండున్నరేళ్ల చొప్పున సీఎం పదవిని పంచుకుంటారనే చర్చ కూడా జరిగింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే నేతృత్వంలో ఇరువురి మధ్య అధికార భాగస్వామ్యంపై చర్చలు జరిగినప్పటికీ.. అలాంటి ఒప్పందాన్ని పార్టీ అధికారికంగా వెల్లడించలేదు. చివరకు.. తప్పనిసరి పరిస్థితుల్లో అధిష్టానం సిద్ధరామయ్యను తప్పించి డీకే శివకుమార్‌కు సీఎం పగ్గాలు అప్పగించింది. 

ఇదీ చదవండి: అధికారులపై కోపంతో ఏం చేశాడో చూడండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement