కొత్త ఏడాది(2026)లో సెకండరీ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగుతుంటే.. ప్రైమరీ మార్కెట్లు కదం తొక్కుతున్నాయి. ఇప్పటికే 55 కంపెనీలకుపైగా ఐపీవోలు చేపట్టి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్కాగా.. వచ్చే వారం మరో 4 కంపెనీలు ఇన్వెస్టర్లను పలకరించనున్నాయి. జాబితాలో కనోహర్ ఎలక్ట్రికల్స్, ప్రసోల్ కెమికల్స్, గ్లాస్ వాల్ సిస్టమ్స్తోపాటు.. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఇండియా(ఆర్సిల్) సైతం చేరింది. తొలి మూడు కంపెనీల పబ్లిక్ ఇష్యూలు 8న ప్రారంభంకానుండగా.. ఆర్సిల్ 9న మార్కెట్లకు చేరనుంది. ఈ నెల 16, 17న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ఇవి లిస్ట్కానున్నాయి. ఉమ్మడిగా ఈ సంస్థలు రూ. 2,717 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉన్నాయి. వివరాలు చూద్దాం..
ట్రాన్స్ఫార్మర్ల తయారీ
ట్రాన్స్ఫార్మర్ల తయారీ, ఈపీసీ సేవల కంపెనీ కనోహర్ ఎలక్ట్రికల్స్ పబ్లిక్ ఇష్యూ రానున్న మంగళవారం(8న) ప్రారంభంకానుంది. ఇందుకు ఒక్కో షేరుకీ రూ. 601–632 ధరల శ్రేణి ప్రకటించింది. గురువారం(10న) ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 756 కోట్ల విలువైన 1.2 కోట్ల షేర్లను ప్రమోటర్ కే సన్స్ ఆఫర్ చేస్తోంది. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,056 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 64 కోట్లు పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. వీటిలో గంగోల్ తయారీ ప్లాంటుకు అవసరమైన మెషీనరీ, పరికరాల కొనుగోలు, ముడిసరుకులు సమకూర్చుకునే సౌకర్యాలకు, ఆఫీస్ బిల్డింగ్ ని ర్మాణం తదితరాలున్నాయి. మరో రూ. 155 కోట్లు వర్కింగ్ క్యాపిటల్కు, మిగిలిన సొమ్మును సాధా రణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. విద్యుత్, రైల్వేలు, పునరుత్పాదక ఇంధన రంగ కంపెనీలకు ప్రొడక్టులను అందిస్తోంది. ట్రాన్స్మిషన్ లై న్లు, సబ్స్టేషన్ల ఈపీసీ కార్యకలాపాలు సైతం నిర్వహిస్తోంది. 2023–24తో పోలిస్తే 2025–26లో ఆదాయం దాదాపు 3 రెట్లు జంప్చేసి రూ. 654 కోట్లకు చేరింది. లాభం సైతం రూ. 18 కోట్ల నుంచి భారీగా దూసుకెళ్లి రూ. 130 కోట్లను తాకింది.
స్సెషాలిటీ కెమికల్స్..
స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ ప్రసోల్ కెమికల్స్ పబ్లిక్ ఇష్యూ 8న ప్రారంభంకానుంది. ఇందుకు ఒక్కో షేరుకీ రూ. 643–676 ధరల శ్రేణి నిర్ణయించింది. 10న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 80 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 420 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 500 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 7న షేర్లను ఆఫర్ చేయనుంది. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్సహా సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. 1992లో ప్రాచీ పాలీ ప్రొడక్ట్స్గా ఏర్పాటైన కంపెనీ 2007లో ప్రసోల్ కెమికల్స్గా రూపాంతరం చెందింది. కంపెనీ ప్రధానంగా ఎసిటోన్తోపాటు.. ఫాస్ఫరస్ ఆధారిత స్పెషాలిటీ కెమికల్స్ను రూపొందిస్తోంది. ఫార్మాస్యూటికల్స్, ఆగ్రోకెమికల్ ఫార్ములేషన్స్ తదితరాలలో ప్రొడక్టులను వినియోగిస్తారు. అంతేకాకుండా గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల తయారీలో కీలక ముడిసరుకుగానూ వినియోగిస్తారు.
ఫాసేడ్ సొల్యూషన్లు..
భవంతుల నిర్మాణ సంబంధ(ఫాసేడ్) సొల్యూషన్లు అందించే గ్లాస్ వాల్ సిస్టమ్స్(ఇండియా) పబ్లిక్ ఇష్యూ 8న ప్రారంభంకానుంది. ఇందుకు ఒక్కో షేరుకీ రూ. 172–182 ధరల శ్రేణి నిర్ణయించింది. 10న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 60 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 368 కోట్ల విలువైన 2.02 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేస్తున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 428 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 7న షేర్లను ఆఫర్ చేయనుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 50 కోట్లు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్కు కేటాయించనుంది. వీటిని మహారాష్ట్రలోని విలే భగడ్ ప్లాంటులో గ్లాస్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు, మిగిలిన రూ. 10 కోట్లు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. 2002లో ఏర్పాటైన కంపెనీ భారత్సహా యూఎస్, ఆస్ట్రేలియాలోనూ సర్వీసులు సమకూర్చుతోంది.
రూ.733 కోట్లకు సై..
రుణాల పునర్వ్యవస్థీకరణ చేపట్టే అసెట్ రీకన్స్ట్రక్షన్(ఇండియా) లిమిటెడ్ వచ్చే బుధవారం(9న) ఐపీవోకు రానుంది. ఆర్సిల్గా పిలిచే ఈ సంస్థ ఇందుకు ఒక్కో షేరుకి 132–139 ధరల శ్రేణి ప్రకటించింది. 11న ముగియనున్న ఇష్యూలో భాగంగా 5.27 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్ సంస్థలు ఎవెన్యూ ఇండియా రిసర్జెన్స్ పీటీఈ, స్టేట్బ్యాంక్తోపాటు, ప్రస్తుత వాటాదారు సంస్థలు లాథే ఇన్వెస్ట్మెంట్ పీటీఈ, ఫెడరల్ బ్యాంక్ విక్రయానికి ఉంచనున్నాయి. వెరసి ఇష్యూ ద్వారా సమీకరించే రూ. 733 కోట్లు కంపెనీకి చేరబోవు. యాంకర్ ఇన్వెస్టర్లకు 8న షేర్లను ఆఫర్ చేయనుంది. కంపెనీ ప్రధానంగా ఒత్తిడిలోపడిన రుణాలను బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి కొనుగోలు చేసి రుణ పరిష్కార ప్రణాళికల ద్వారా పునర్వ్యవస్థీకరణకు తెరతీస్తుంటుంది.
ఇదీ చదవండి: జీతం మొత్తం ఈఎంఐలకే సరిపోతోందా?


