రైలు కిందపడి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
కళాశాలకు వెళ్లమని తండ్రి మందలించడంతో మనస్తాపం
తెలంగాణ: కళాశాలకు వెళ్లమని తండ్రి మందలించడంతో అనంతపూర్ నుంచి సికింద్రాబాద్కు చేరుకున్న ఇంటర్ విద్యార్ధి రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ రైల్వే పీఎస్ జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. లాలాగూడ–సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ల అప్లైన్ మధ్యన గురువారం గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది.
ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులకు మృతుడి ప్యాంటు జేబులో జనరల్ రైల్ టికెట్ లభించింది. దానిపై నాన్న అని మొబైల్ నెంబర్ రాసి ఉంది. ఆ నెంబర్కు కాల్ చేసిన పోలీసులు మృతుడు అనంతపూర్కు చెందిన గోసల రమేశ్ కుమారుడు పవన్సాయి (18)గా గుర్తించారు. పవన్సాయి అనంతపూర్లోని నారాయణ రెసిడెన్సియల్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వినాయక చవితి సెలవులకు పవన్సాయి ఇంటికి వచ్చాడు. సెలవుల తరువాత తిరిగి కళాశాలకు వెళ్లకపోవడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com
ఇదీ చదవండి: చెల్లిని కాపాడేందుకు వాగులో దూకిన అన్న.. పరిస్థితి తారుమారు!


