జనగామ జిల్లా: గతంలో ఎస్ఐ ఉద్యోగ వేట ఫలించలేదు. ఈసారి అయినా వస్తుందో.. రాదోనని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా చిల్పూరు మండలం శ్రీపతిపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ సిరిపురం నవీన్కుమార్, మృతుడి మేనమామ భరత్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభాకర్–స్వరూప దంపతులకు ముగ్గురు కుమారులు, కూతురు ఉంది.
తండ్రి ప్రభాకర్ మహారాష్ట్రలో ఓ రైల్వే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉంటున్నారు. అతని రెండో కుమారుడు పొడిశెట్లి సాయి (26)కి పోలీస్ ఉద్యోగం అంటే మక్కువ. గతంలో పరీక్ష రాయగా కొద్ది మార్కులతో రాలేదు. నోటిఫికేషన్ విడుదల కాగా, మళ్లీ ప్రిపేర్ కావడానికి ఇటీవల స్వగ్రామానికి వచ్చి మేనమామ భరత్ వద్ద ఉంటున్నాడు. మూడు రోజుల నుంచి స్నేహితుల వద్ద ఈసారైనా తాను పాస్ అయితే ఇంట్లో అమ్మనాన్నల కష్టాలు తీరుతాయని, కానీ, జాబు వచ్చే నమ్మకం లేదంటూ బాధ పడుతుండేవాడు. గురువారం ఉదయం నుంచే స్నేహితులందరినీ కలిసిన సాయి.. ఓ సూసైడ్ నోట్ రాసి అందరికి వాట్సాప్లో పంపాడు.
అనంతరం ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వాట్సాప్ చూసిన స్నేహితులు హుటాహుటిన అతని ఇంటికి చేరుకొని చూసేసరికే మృతి చెందాడు. మృతుడి మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ నవీన్కుమార్ తెలిపారు. పోలీసులు స్వా«దీనం చేసుకున్న సూసైడ్ నోట్లో ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. నేనే బాధ్యుడిని. అమ్మ బాపు నా వల్ల ముందు ముందు మీరు బాధ పడకూడదు. నేను మీకు భారం కావొద్దు అనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంటున్నా’అని ఉంది.


