సంగారెడ్డి జోన్/సంగారెడ్డి టౌన్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ(ఆర్టీసీ)లో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎనిమిదేళ్ల సుదీర్ఘకాలం తర్వాత ఆర్టీసీలో ఎన్నికల సందడి జరగనుంది. గత ప్రభుత్వ హయాంలో 2016 జూలై 19న చివరిసారిగా ఎన్నికలు జరిగాయి. 2018లో ఎన్నికలు జరగాల్సి ఉండగా అప్పటి ప్రభుత్వం నిర్వహించలేకపోయింది. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణతోపాటు డిమాండ్లను పరిష్కరించాలని కార్మిక సంఘం నాయకులు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కరించటంతోపాటు ఎన్నికల నిర్వహణకు సానుకూలంగా స్పందించడంతో ఆందోళనను విరమించారు. ఇచ్చిన హామీ మేరకు గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది.
ఎన్నికలకు సిద్ధమవుతున్న సంఘాలు
మెదక్ రీజియన్ పరిధిలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపొందిన సంఘంతో ప్రభుత్వంతో చర్చలు జరుపుతుంది. ఎన్నికల్లో పోటీ చేసి గెలుపే లక్ష్యంగా ఆయా కార్మిక సంఘాల నేతలు పావులు కదుపుతున్నారు.
9 డిపోలు..1,922 మంది కార్మికులు(ఓటర్లు)
మెదక్ రీజన్ పరిధిలో 9 డిపోలు ఉండగా 1,922 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. మెదక్ 265, ఖేడ్ 213, సంగారెడ్డి 353, సిద్దిపేట, జహీరాబాద్ 285, గజ్వేల్– ప్రజ్ఞాపూర్ 236, దుబ్బాక 129, నర్సాపూర్ 115 మంది కార్మికులు ఉండగా రీజనల్ కార్యాలయంలో 41మంది విధులు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులందరినీ ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నదే ప్రధాన డిమాండ్. అదేవిధంగా ఇతర డిమాండ్లు సైతం ఉన్నాయి.
ఎన్నికల షెడ్యూల్ ఇలా..
గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. 21న పోటీ చేయాలని కార్మికులు తమ సమ్మతి పత్రాలు సమర్పించాలి. 22న డిపో మేనేజర్లు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా అందజేసి 24 వరకు యూనియన్ల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తుంది. 25 తుది ఓటరు జాబితా ప్రకటిస్తుంది. 26 పోటీ చేసే యూనియన్లకు గుర్తులు కేటాయింపు, రిటర్నింగ్ అధికారికి తుది ఓటరు జాబితా సమర్పిస్తారు. 29న యూనియన్లకు డమ్మీ బ్యాలెట్ పేపర్లు పంపిణీ చేస్తారు. అక్టోబర్ 9న ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించి 17న ఫలితాలను ప్రకటించనున్నారు.
అక్టోబర్ 9న పోలింగ్..17న ఓట్ల లెక్కింపు
ఎన్నికలకు సిద్ధమవుతున్న కార్మిక నేతలు
షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణ
షెడ్యూల్ ప్రకారమే ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 21 నుంచి ప్రక్రియ మొదలవుతుంది. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మెదక్ రీజియన్ పరిధిలో ఉన్న ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి.
–విజయ్ కుమార్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, మెదక్ రీజియన్


