బీఆర్ఎస్ నాయకులకు ఏఎంసీ చైర్మన్లు యాదగిరి, మహేందర్ యాదవ్ సవాల్
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఎన్నికల అఫిడవిట్లో కంటే అధికంగా ఆస్తులు ఉంటే రాజీనామాకు సిద్ధమా అని నంగునూరు, చిన్నకోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు దేవులపల్లి యాదగిరి, మీసం మహేందర్ యాదవ్ బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ల విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ..22ఏ భయంతో బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీకి రాకుండా బయట గందరగోళం నిర్వహించారన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలకు భయపడి బీఆర్ఎస్ నాయకులు ఫామ్హౌస్లకే పరిమితమయ్యారని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక అవినీతి, అక్రమాలు చేశారని ఆరోపించారు. ఎలాంటి భూమిలేదని చెప్పిన హరీశ్రావుకు ఇన్ని ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని తమ పేర పట్టా చేయించుకున్నారన్నారు. గతంలో కేసీఆర్కు సొంత ఇల్లు లేదని చెప్పిన కేటీఆర్ ఇప్పుడు వేల ఎకరాలు భూమి, ఖరీదైన ఫామ్హౌస్లు ఎక్కడి నుంచి వచ్చాయో వివరించాలన్నారు. రంగనాయక సాగర్ వద్ద 36 ఎకరాల భూమి ఎఫ్టీఎల్లోనే ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ.30వేల కోట్ల నుంచి రూ.లక్షల కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. హరీశ్రావు రంగనాయక సాగర్ నుంచి కన్నెపల్లి పంప్హౌస్ వద్దకు పాదయాత్ర చేయాలన్నారు. అప్పుడే బీఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతి, అక్రమాలతో తెలంగాణ ఎంత నష్టపోయిందో తెలుస్తుందన్నారు.


