విజయవాడ కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో సృష్టి
సాయికృష్ణ పాడుబడిన భవనంలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా
చూసినట్టు సీఐ స్నేహితుడితో చెప్పించిన సిట్?
పాడుబడ్డ భవనంలో హత్య జరిగితే.. ఆ భవనాన్ని ఎందుకు సీజ్ చేయలేదు?
పోలీసులు తనను చంపడానికే తీసుకొచ్చారని సాయికృష్ణ చెప్పాడంటున్న సీఐ స్నేహితుడు
సీఐ నాగరాజును ఒక్కడినే సిట్ ఫిక్స్ చేస్తోందా?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడకు చెందిన కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ ఇచ్చిన రిమాండ్ రిపోర్టు అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. అరెస్టయిన సీఐ నాగరాజుకు స్నేహితుడైన సురేష్ లొంగిపోయిన తర్వాత కోర్టులో సిట్ సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సాయికృష్ణది లాకప్డెత్ కాదని.. బయట కొట్టి చంపారనే కొత్తవాదన తెరపైకి తేవడం ద్వారా దీని వెనుక ఉన్న పెద్దలను తప్పించేందుకు సిట్ ప్రయత్నం చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో సీఐ నాగరాజుతోపాటు కానిస్టేబుళ్లు అశోక్కుమార్, నానీ, ఇతర వ్యక్తులను కస్టడీకి తీసుకుని విచారించినప్పుడు పేర్కొనని కొత్త కథను సిట్ బయటపెట్టింది. సాయికృష్ణను మే 7న కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని లాకప్లో కొట్టడం తాను చూశానని, అయితే 12న రాణిగారి తోటలో కనకదుర్గ వారధి పక్కన ఉన్న పాడుబడిన భవనంలో సాయికృష్ణ చావుబతుకుల మధ్య ఉండగా చూశానని సురేష్తో సిట్ చెప్పించినట్టు అర్థమవుతోంది.
తనను చంపాలన్న ఉద్దేశంతోనే పోలీసులు కొడుతున్నట్టు సాయికృష్ణ తనతో చెప్పాడని సురేష్ చెప్పడాన్ని బట్టి చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. సాయికృష్ణ తాను చూస్తుండగానే చనిపోయాడని, మృతదేహాన్ని స్వర్గపురి శ్మశాన వాటికకు అశోక్కుమార్, నాని కలిసి ద్విచక్ర వాహనంపై తరలించారని.. 12 తేదీన అర్ధరాత్రి మృతదేహాన్ని దహనం చేసి పూర్తిగా కాలిపోయే వరకు తాను అక్కడే ఉన్నట్టు సురేష్ తో చెప్పించారు.
మే 18న నిందితులు మళ్లీ స్వర్గపురి శ్మశాన వాటికకు వెళ్లి, మృతదేహానికి సంబంధించిన కాలిపోని అవశేషాలు ఏమైనా మిగిలాయా అని పరిశీలించినట్టు చెబుతున్న సిట్.. సెపె్టంబర్ 18న స్వర్గపురి శ్మశాన వాటికలోని కలప దహన ప్రాంతంలో 16వ సిమెంట్ ప్లాట్వద్ద మృతదేహాన్ని దహనం చేసినట్టు సురేష్ గుర్తించాడని, ఆ ప్రాంతంలో బూడిదతోపాటు కాలిపోయిన మానవ ఎముకల ముక్కలు లభించాయని, వాటిని తదుపరి దర్యాప్తు కోసం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొనడం గమనార్హం.
అప్పుడలా.. ఇప్పుడిలా.. సాధ్యమెలా!
ఇంతకుముందు కృష్ణలంక పోలీసు స్టేషన్ రెండో అంతస్తులో బూడిద, ఎముకలు గుర్తించినట్టు ఇదే సిట్ చెప్పింది. మే 12న సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేస్తే సెపె్టంబర్ 18 వరకూ స్వర్గపురి శ్మశాన వాటికలో బూడిద, ఎముకలు ఉండటం ఎలా సాధ్యమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోజూ పదుల సంఖ్యలో శవాలు దహనం కోసం వచ్చేచోట నాలుగు నెలల తర్వాత ఆధారాలు దొరకడం సాధ్యమేనా అన్నది ప్రశ్నగా మారింది. మరోవైపు సాయికృష్ణ మరణించాడని చెబుతున్న పాడుబడిన భవనాన్ని సిట్ ఎందుకు సీజ్ చేయలేదనే అంశంతోపాటు ఆధారాల కోసం ఎందుకు ప్రయత్నించలేదో కూడా చెప్పాల్సి ఉంటుంది. సీఐ స్నేహితుడు సురేష్ ను సిట్ శుక్రవారం ఘటనా స్థలానికి తీసుకెళ్లినా స్థానిక పోలీసులకు, స్పెషల్ బ్రాంచ్కు తెలియకపోవడం గమనార్హం. ఇదంతా సిట్ చెబుతున్న కట్టుకథ అని పోలీసు వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.
ఇవీ సందేహాలు
అసలు సాయికృష్ణను మార్కాపురం నుంచి ఎందుకు తీసుకొచ్చారు?, వారెంట్ పెండింగ్ ఉంటే అరెస్టు చేయడానికి కృష్ణలంక పోలీసుల స్థానంలో టాస్్కఫోర్స్ ఎందుకు వెళ్లింది?, కృష్ణలంక పోలీసులకు తాము అప్పగించిన నిందితుడిని ఐదు రోజులపాటు కోర్టులో ప్రవేశపెట్టకపోతే టాస్్కఫోర్స్ ఎందుకు పట్టించుకోలేదు?, వారిపై ఉన్న ఒత్తిడి ఏంటి?, అసలు సాయికృష్ణను చంపాలన్నది ఎవరి నిర్ణయం?, తన కళ్లముందే చనిపోయాడని చెబుతున్న సురేష్ అసలు ఈ హత్య ఎందుకు జరిగిందో ఎందుకు చెప్పలేదు?, ఈ కేసులో సీఐ నాగరాజును, నలుగురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును బలిపశువులను చేసి మిగిలిన వారిని తప్పిస్తున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే, ఎట్టకేలకు సాయికృష్ణను పోలీసులే కొట్టిచంపినట్టు తేల్చారు. మరణ తేదీని, ఎక్కడ దహనం చేసింది నిర్ధారించడం ఒక్కటే సిట్ తేలి్చంది.


