సాక్షి, విశాఖపట్నం: రాజకీయాల్లో వాగ్దానాలు సహజమే. కానీ, జనం గొంతెండుతుంటే ’భవిష్యత్తులో సముద్రాన్నే తీసుకొస్తా’ అంటూ గ్రాఫిక్స్ చూపించడం బహుశా చంద్రబాబుకే చెల్లుతుందేమో! సమస్యను ప్రపంచం మీదకు నెట్టేయడం, తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వేదికగా ఆయన చేసిన ప్రసంగం సగటు విశాఖ వాసిని విస్మయానికి గురిచేసింది. ఈ గారడీ మాటల వెనుక ఉన్న అసలు వాస్తవాలు చూస్తే.. చంద్రబాబువి మాటలా.. మాయలా.. అనే సందేహం కలగక మానదు.
గుక్కెడు నీళ్లడిగితే.. గోదావరి చూపించారు!
ప్రస్తుతం విశాఖ ప్రజలు తాగునీటి కోసం కటకటలాడుతున్నారు. బిందెలు పట్టుకుని వీధుల్లో పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం నుంచి తక్షణ ఉపశమనం ఆశిస్తుంటే.. సీఎం మాత్రం వింత వాదన తెరపైకి తెచ్చారు. ’నీటి సమస్య ఇక్కడే కాదు, ప్రపంచమంతా ఉంది’ అంటూ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. పోనీ అక్కడితో ఆగారా? అంటే అదీ లేదు. వచ్చే ఏడాది విశాఖకు ఎన్ని టీఎంసీలు కావాలంటే అన్ని గోదావరి జలాలు తీసుకొస్తామని గొప్పలు చెప్పారు. ప్రాణం పోతున్నవాడికి.. ‘ఆగు నాయనా.. వచ్చే ఏడాది నీకోసం పెద్ద బావి తవ్విస్తా’ అన్నట్లుగా ఆయన తీరు ఉందంటూ జనం మండిపడుతున్నారు. ఎల్నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ఏడాది క్రితమే హెచ్చరించినా పట్టించుకోని బాబు.. ఇప్పుడే తీరిగ్గా సమీక్షలు చేశానంటూ చేతులు దులుపుకోవడం గమనార్హం.
పంచగ్రామాలకు.. ’షరతులు వర్తిస్తాయి’
వ్యాపార ప్రకటనల్లో ఆఫర్ను పెద్ద అక్షరాలతో చూపించి, కింద కంటికి కనిపించని అక్షరాలతో ‘షరతులు వర్తిస్తాయి’ అని ముద్రించినట్లుగా ఉంది పంచగ్రామాల భూముల వ్యవహారం. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న 12 వేల మందికి త్వరలోనే పట్టాలు ఇచ్చేస్తామని వేదిక మీద ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. ఆ ప్రాంత ప్రజలు సంతోషించేలోపే.. ‘అయితే.. ఈ సమస్య కోర్టులో ఉంది కాబట్టి మా వంతు ప్రయత్నిస్తాం’ అంటూ క్షణాల్లో మాట మార్చేశారు. ముందుగా ఆకాశమంత ఆశలు రేపి, మరుక్షణమే కోర్టుల సాకుతో పాతాళానికి తొక్కేయడం పంచగ్రామాల ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది.
ఉక్కు భూముల వేలం కనిపించలేదా?
విశాఖ సభ ద్వారా వైజాగ్ స్టీల్ప్లాంట్ భవితవ్యంపై సీఎం స్పష్టమైన భరోసా ఇస్తారని కార్మికులు ఆశించారు. కానీ, ప్లాంట్ భూములు ఇప్పుడు బహిరంగంగా వేలంలోకి వెళ్తుంటే.. దీనిపై ఆయన కనీసం పల్లెత్తు మాట మాట్లాడకపోవడం ఉక్కు సంఘాలను ఆగ్రహానికి గురిచేస్తోంది. ప్రస్తుత సంక్షోభంపై స్పందించకుండా, ఎప్పుడో ఇచ్చిన ప్యాకేజీ గురించి గొప్పలు చెప్పుకుంటూ తనను తానే కీర్తించుకున్నారు.
మొత్తంగా.. విశాఖ సభలో చంద్రబాబు ప్రసంగం సమస్యలను పక్కదారి పట్టించే ‘పొలిటికల్ స్క్రీన్ ప్లే’లా సాగింది. నగరంలో తాగునీరు, పంచగ్రామాల భూములు, స్టీల్ప్లాంట్ వంటి కీలక అంశాలపై తక్షణ పరిష్కారాలను గాలికొదిలేసి, తప్పులను ఇతరుల మీదకు నెట్టేసి, భవిష్యత్తు గురించి భ్రమలు కల్పించడంలో తనను మించిన వారు లేరని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు.
ఇదీ చదవండి: శు‘భ్రమే’.. అది సిత్రమే!


