తెలంగాణ పోలీసుల సమిష్టి కృషికి దక్కిన జాతీయ గుర్తింపు: షికా గోయల్
సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ మరో మైలురాయి
దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ సైబర్ క్రైమ్ పనితీరు
తెలంగాణకు నంబర్-1 ర్యాంక్ రావడం గర్వకారణం: షికా గోయల్
హైదరాబాద్: సైబర్ క్రైమ్ నియంత్రణ, కేసుల సమర్థవంతమైన నిర్వహణలో తెలంగాణ దేశంలోనే నంబర్-1 స్థానంలో నిలిచిందని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) వెల్లడించింది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ సైబర్ క్రైమ్ పనితీరుపై సమీక్ష నిర్వహించగా, రాష్ట్రం సాధించిన పురోగతిపై అధికారులు వివరించారు.
ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్ సంజయ్ జాజు, డీజీపీతో కలిసి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధిపతి షికా గోయల్ పాల్గొన్నారు. సైబర్ నేరాల నియంత్రణ, కేసుల పరిష్కారం, నేరాలపై వేగవంతమైన చర్యల్లో తెలంగాణ పోలీసుల పనితీరుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని షికా గోయల్ తెలిపారు.
తెలంగాణ పోలీసుల సమిష్టి కృషి, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక చర్యల ఫలితంగానే ఈ గుర్తింపు సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ మరో మైలురాయిని చేరుకుందని, దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా సైబర్ క్రైమ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
సీఎస్ సంజయ్ జాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నేరాల పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. TGCSB ద్వారా ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి సైబర్ నేరాలపై పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. తెలంగాణ పోలీసులకు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో బృందానికి అభినందనలు తెలిపారు.


