హైదరాబాద్: తన ప్రాణాలకు ముప్పు ఉందని, ఏ క్షణమైనా తనను చంపేస్తారని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ తెలిపారు. ఉంటున్న ఇంటిపై కొంత మంది వ్యక్తులు దాడి చేశారని గురువారం మీడియాకు వెల్లడించారు. తనకు ఏమైనా అయితే వారిదే బాధ్యత అని అన్నారు. వారి వివరాలు మీడియాకు ఇస్తానని అన్నారు. తన ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. తాను ప్రేమించిన యువతి ఇంట్లో నెల రోజులుగా ఉంటున్నట్టు ఆయన వెల్లడించారు.
ప్రాణాల మీద ఆశ వదులుకుని, చావుకు తెగించి మీడియా ముందుకు వచ్చాను. నన్ను ఎప్పుడైనా చంపేయొచ్చు. పోలీస్ స్టేషన్కు వెళ్లే దారిలో కూడా చంపేయొచ్చు. మీడియాతో మాట్లాడిన తర్వాత నేను బతికి ఉంటానో, లేదో తెలియదు. నేను శ్రియశ్రీ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. జూలై 8న మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఇదంతా మా తల్లిదండ్రులకు తెలుసు. మా పెళ్లి చేయడానికి వారు ఇష్టపడలేదు. మా అత్తమ్మ కుటుంబంతో కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాను. ఒక నెల నుంచి మా అత్తమ్మ వాళ్ల ఇంట్లోనే ఉంటున్నాను.
నిన్న 40 మంది వ్యక్తులు వచ్చి నేను ఉంటున్న ఇంటిపై దాడి చేశారు. నా ప్రేమ వ్యవహారం కారణంగానే ఇదంతా జరుగుతోంది. ముందు నుంచి మా ప్రాణాలు ముప్పు ఉంది. మేం ముగ్గురం చనిపోతే వాళ్లదే బాధ్యత. వారి కాల్డేటా వివరాలు మీడియాకు ఇస్తానని సంతోష్ గౌడ్ తెలిపారు. కాగా, తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడం తన తండ్రికి ఇష్టం లేదని, ఈ నేపథ్యంలోనే దాడి జరిగిందని వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ స్పందించాల్సి ఉంది.
పోలీస్ స్టేషన్లో కానీ, కోర్టులో కానీ నాకు న్యాయం జరుగుతుందని నేను అనుకోవడం లేదు.
చావుకు తెగించి మీతో మాట్లాడుతున్నా... నన్ను ఎప్పుడైనా చంపేయొచ్చు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే (ప్రస్తుతం కాంగ్రెస్) ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్.
తాను ప్రేమించిన యువతిని వివాహం… pic.twitter.com/cVk9oXD3yK— greatandhra (@greatandhranews) August 6, 2026


