హైదరాబాద్ మహానగర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. నోటిఫికేషన్ వెలువడిన మొదట్లో పెద్దగా ఆసక్తి చూపని ప్రజలు ఇటీవలి కాలంలో ఇందిరమ్మ ఇళ్లకు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆగస్టు 10న దరఖాస్తు గడువు ముగియనుండటంతో మిగిలిన ఐదు రోజుల్లో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందవచ్చునని అధికారులు భావిస్తున్నారు. క్యూర్ పరిధిలోని 19 నియోజకవర్గాల్లో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటికే 26 వేల వరకు దరఖాస్తులు రాగా అందులో అత్యధికంగా కూకట్పల్లి నియోజకవర్గం నుంచి 5 వేల దరఖాస్తులు అందినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
అత్యంత విలువైన భూముల్లో..
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ 9వ ఫేజ్ సమీపంలోని హౌసింగ్ బోర్డు భూముల్లో ఇందిరమ్మ ఇళ్లు నిరి్మంచేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పరిసర కాలనీల్లో చదరపు గజం భూమి విలువ కనీసం రూ.1.50 లక్షలకు పైగా ఉంది. అలాంటి విలువైన భూమిలో ఇళ్లను నిర్మిస్తుండటం, కేవలం రూ. లక్షలకే ఇస్తుండటంతో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. బహుళ అంతస్తుల భవనాల రూపంలో 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో 480 ఇళ్లను నిరి్మస్తున్నారు. బెడ్రూమ్, హాలు, కిచెన్ కలిగిన ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటికే ఐదు వేలకు పైగా దరఖాస్తులు అందాయి. మిగిలిన ఐదు రోజుల్లో మరో నాలుగు వేలకు పైగా దరఖాస్తులు అందవచ్చునని అధికారుల అంచనా.
నిబంధనలతో అయోమయం..
ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం విధించిన నిబంధనలు దరఖాస్తుదారుల ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. దరఖాస్తుదారులు, వారి తల్లిదండ్రులు కూడా ఎలాంటి ఇళ్లు, ఫ్లాట్, ఇంటి స్థలం కలిగి ఉండరాదు. తమ నివాసం ధృవీకరణకు ఆధార్ కార్డును ప్రామాణికంగా చూపాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఆధారంగా ఆయా నియోజకవర్గంలో నిర్మించే ఇళ్లకు మాత్రమే దరఖాస్తులను పరిశీలిస్తారు. దీంతో చాలా మందికి నివాసం ధృవీకరణ అంశంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం.
అదే విధంగా కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. 6 లక్షలకు మించకూడదు. కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకోవడంతో వార్షిక ఆదాయం విషయంలోను, గతంలో ప్రభుత్వ పథకాల లబ్దిదారులుగా ఉండకూడదు అనే నిబంధనల్లో కొంత సందిగ్ధత నెలకొందని స్థానికులు చెబుతున్నారు. ఈ నిబంధనల మేరకు తీరా దరఖాస్తు చేసుకున్న తర్వాత పరిశీలనలో తిరస్కరణకు గురైతే కట్టిన రూ.10 వేలు వెనక్కి వస్తాయో రావా అనే అనుమానంతో కొందరు ఆసక్తి చూపడం లేదు. ఏదేమైనా ఆసియాలోనే అతి పెద్ద కాలనీగా గుర్తింపు పొందిన కూకట్పల్లి హౌసింగ్ కాలనీలో రూ.6 లక్షలకే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుండటంతో వాటిని దక్కించుకునేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.


