ఏలూరు జిల్లా: ప్రియురాలిని ప్రేమ వివాహం చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లిన యువకుడిపై యువతి తల్లిదండ్రులు రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గొల్లపల్లికి చెందిన యువతి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలోని తన మేనమామ ఇంటి దగ్గర ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ, మూడు రోజుల క్రితం వివాహం చేసుకుని బాపులపాడు మండలం వీరవల్లి పోలీసులను ఆశ్రయించారు.
వారిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి, యువతిని భర్త ఇంటికి పంపించారు. అయితే, తమ అమ్మాయిని తమ దగ్గరకు పంపించాలంటే ఆమె భర్త రూ.12 లక్షలు డిమాండ్ చేస్తున్నాడంటూ సోమవారం నూజివీడు రూరల్ పోలీస్స్టేషన్లో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
కానీ యువకుడిని పెళ్లి చేసుకున్న యువతినుంచి ఎలాంటి ఫిర్యాదు లేకపోవడంతో.. యువతి తల్లిదండ్రులు పెట్టిన ఆరోపణలు ఎంత వరకు నిజం ఉందేనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.


