సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కేసులో ఢిల్లీ హైకోర్టు మంగళవారం కీలక తీర్పు ఇచ్చింది. ఎక్స్ ఖాతాపై (గతంలో ట్విట్టర్) ఖాతాపై ఉన్న బ్లాక్ను తొలగించి, దానిని పునరుద్ధరించాలని ఆదేశించింది. నీట్ పరీక్ష ముగిసిపోయినందున, కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన ప్రాథమిక ఆందోళనకు ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత లేదని పేర్కొంటూ జస్టిస్ స్వర్ణ కాంత శర్మతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
ఈ అంశంపై కోర్టులో ప్రభుత్వం తరపున భారత సొలిసిటర్ జనరల్ (SG) తుషార్ మెహతా వాదనలు వినిపించారు. నీట్ పరీక్ష సమయంలో ఈ పార్టీ చేసే పోస్టుల వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులలో గందరగోళం,అశాంతి నెలకొనే అవకాశం ఉందనే ప్రాథమిక ఆందోళనతోనే కేంద్ర ప్రభుత్వం ఆ అకౌంట్ను బ్లాక్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ప్రస్తుతం పరీక్షలు పూర్తయినందున ఆ ఆందోళనలు తొలగిపోయాయని, కాబట్టి ఆ అకౌంట్ను అన్బ్లాక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. దీంతో కోర్టు కేంద్ర ప్రభుత్వ బ్లాకింగ్ ఆర్డర్ను రద్దు చేస్తూ తదుపరి చర్యలు చేపట్టింది.
గతంలో, ఈ విషయమై కాక్రోచ్ ఫౌండర్ అభిజిత్ దీప్కే కేసును పరిశీలించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కి చెందిన రివ్యూ కమిటీని కోర్టు ఆదేశించింది. అలాగే వర్చువల్ విధానంలో కమిటీ ముందు హాజరయ్యేందుకు దీప్కేకు అవకాశం కూడా కల్పించింది.కాగా నీట్ అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టింది.


