నెల్లూరు జిల్లా: వివాహేతర సంబంధం కొనసాగించేందుకు అడ్డుగా ఉన్నాడని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను ప్రియుడితో కలిసి 2021లో హత్య చేసిన ఘటనలో నేరం రుజువు కావడంతో హతుడి భార్యతో పాటు ఆమె ప్రియుడికి జీవిత ఖైదు విధిస్తూ సోమవారం గూడూరు కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఒకటో పట్టణ సీఐ శేఖర్బాబు తెలిపిన వివరాల మేరకు.. గూడూరులోని నరసయ్యగుంట ప్రాంతానికి చెందిన రూపేష్ మానస 10 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.
వీరికి ముగ్గురు పిల్లలు. మానసకు గూడూరు మండలం కొండగుంట గ్రామానికి చెందిన ఎంట్రపాటి రవివర్మతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న రూపేష్ ఓ రోజు కోపంతో రవివర్మపై దాడి చేశాడు. దీంతో రవివర్మ, మానస కలిసి రూపేష్ ను హత మార్చాలనుకున్నారు. పధకంలో భాగంగా మానస అత్తగారి ఇంటికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన రవివర్మ నరసయ్యగుంటలోని రూపేష్ ఇంటికి చేరుకుని నిద్రలో ఉన్న రూపేష్ తలపై ఇనుప రాడ్తో మోది హత్య చేశాడు.
మరుసటి రోజు ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు హత్య జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు కేసు నమోదు చేయగా అప్పటి సీఐ జి.దశరథరామారావు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచారు. నేరం రుజువు కావడంతో గూడూరు ఏడో అదనపు జిల్లా జడ్జి కె.వెంకటనాగ పవన్ సంచలన తీర్పును ఇస్తూ నిందితులైన రవివర్మ, మానసలకు జీవిత ఖైదుతోపాటు రూ.50 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఆరు నెలలు కఠిన కారాగార శిక్ష విధించారు.


