సాక్షి,కర్ణాటక: బెళగావి జిల్లాలో దారుణం జరిగింది. భార్య నిత్యం నైటీ వేసుకోవడం ఇష్టం లేని భర్త కోపోద్రీక్తుడయ్యాడు. ఇద్దరి మధ్య రగడ పతాకస్థాయికి చేరింది. నైటీ ధరించ వద్దని భార్యకు పదే పదే భర్త సూచించినా పట్టించుకోలేదని ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. దీంతో ఆ మహిళ చావుబతుకుల మధ్య కొట్టామిట్డాడుతోంది. బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా నందగుండదహళ్లి గ్రామానికి చెందిన కృష్ణాజీ పాటిల్, మంజుల భార్యాభర్తలు.
వీరికి ఎనిమిదేళ్ల క్రితం ఇద్దరికి వివాహమైంది. ఏడాది కాలంగా ఇంట్లో భార్య చీరకు బదులుగా నైటీ, గౌన్ వేసుకుంటూ తిరిగేది. నైటీ వేసుకోవద్దని భార్యతో అప్పుడప్పుడు గొడవపడేవాడని స్థానికులు, పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో పెట్రోలు పోసి నిప్పు అంటించడంతో 80 శాతం మేర శరీరం కాలిపోయిందని, దీంతో చావుబతుకుల మధ్య మంజుల ఆస్పత్రిలో పోరాడుతోంది. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.


