రైలు ప్రయాణం అనగానే సర్వసాధారణంగా చిన్న బాక్స్లో భోజనం పెట్టుకుని తెచ్చుకుంటారు. ఓవర్నైట్ ప్రయాణమైతే సాధ్యమైనంత వరకు చాలామంది ప్రయాణికులు ఇలానే తెచ్చుకుంటారు. మరికొందరు ట్రైన్లో అమ్మే ఆహారాలతో పనికానిస్తారు. కానీ ఈ అమ్మ అంతకు మించి ఆలోచించింది తన పిల్లలు గురించి. వాళ్ల ఆరోగ్యం బేషుగా ఉండాలని ఏం చేసిందో తెలిస్తే నవ్వు ఆగదు.
అందుకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రాత్రిపూట రైలు ప్రయాణం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. పాపం ఆ తల్లి సామాన్లు సర్దడంలో ఎంత శ్రమపడిందో ఆమె ఆహారం సర్వ్ చేసిన విధం చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఆ వీడియో ఒక అమ్మాయ్ ప్రెషర్ కుక్కర్ను బ్యాలెన్స్ చేస్తూ నవ్వడంతో మొదలవుతుంది.
తన తల్లి బ్యాగ్ నుంచి కుక్కర్ బయటకు తీసి..రైలులోనే తన కుటుంబ సభ్యులకు వేడి వేడి పలావ్ను చాలా మామూలుగా వడ్డించడం మొదలుపెట్టింది. ఆ వీడియోకి “అమ్మకు ఇది రాత్రిపూట రైలు ప్రయాణం అని చెప్పాను... ఆమె కుక్కర్ సర్దింది.” అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు.
నెటిజన్లు సైతం ఈ వీడియోని చూసి మా కుటుంబంతో కలిసి ప్రయాణించిన రోజులు గుర్తొస్తున్నాయని కొందరు, ఇంకొందురు వేడిగా పెట్టాలన్న ఆత్రం, ఆ తల్లి ప్రేమ రెండు కనిపిస్తున్నాయ్ అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.


