రొమేనియాలోని క్రైయోవా నగరంలో చాకచక్యంగా వ్యవహరించి అనూహ్యంగా 5 ఏళ్ల బాలికను కాపాడిన భారతీయ సంతతికి చెందిన 47 ఏళ్ల నిర్మాణ కార్మికుడు విపన్ కుమార్కు అరుదైన గౌరవం దక్కింది. అతని సాహసానికిగాను అక్కడి ప్రభుత్వం గౌరవ పౌరసత్వం (Honorary Citizenship) ఇచ్చి సత్కరించింది.
ఈ ఏడాది జనవరిలో రొమేనియాలోని క్రాయోవా (Craiova) నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గడ్డకట్టిన సరస్సులో పడిపోయి ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న ఐదేళ్ల బాలికను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టాడు విపన్ కుమార్. గడ్డకట్టిన సరస్సులోకి దూకి అత్యంత సాహసంగా బాలిక నురక్షించాడు. అప్పటి ఈ రెస్క్యూ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
ఏం జరిగిందంటే..
పార్క్లో తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఆ చిన్నారి, స్లెడ్జ్ పై నుంచి దూకి గడ్డకట్టిన సరస్సు వైపు పరుగెత్తింది. ఆమె బరువుకు మంచు పలక కరిగి, ఆమె నీటిలో పడిపోయింది. కూతురిని కాపాడటానికి తండ్రి కూడా నీటిలోకి వెళ్లాడు కానీ, అతను కూడా మంచు మధ్య చిక్కుకుపోయాడు. ఇది చూసిన విపన్ కుమార్ ఒక స్లెడ్జ్ సహాయంతో మంచుపై పాకుకుంటూ బాలిక వైపు వెళ్లారు. ఈ సమయంలో అతని కింద ఉన్న మంచు పొర కూడా కరిగిపోయింది. అయినా సమయస్ఫూర్తితో బాలిక చేతిని పట్టుకుని, అత్యవసర రెస్క్యూ బృందాలు వచ్చే వరకు ఆమె తల నీటిపైనే ఉండేలా గట్టిగా పట్టుకున్నాడు. చివరకు రెస్క్యూ టీమ్ ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసి ఆమెను ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన చలి కారణంగా ఇద్దరూ 'హైపోథెర్మిక్ షాక్'కు గురైనప్పటికీ, ప్రాణాపాయం తప్పింది. విపన్ కుమార్ హీరోగా ప్రశంసలు అందుకున్నాడు.
ఆనాటి అనుభవాలను గుర్తు చేసుకుంటే విపన్ ఇలా చెప్పారు : "నేను నా స్నేహితుడితో కలిసి నడుస్తూ వెళ్తున్నాను. అప్పుడు ఆ చిన్నారి నీటిలో మునిగిపోవడం చూసి, వెంటనే సరస్సులోకి దూకాను. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. అసలు ఆ సమయంలో ఆలోచించడానికి అస్సలు సమయం లేదు. ఎలాగైనా ఆ అమ్మాయిని బయటకు తీయాలనేదే నా మనసులో ఉంది. కానీ ఆ చిన్నారి చాలా ధైర్యవంతురాలు’’ అని చెప్పుకొచ్చాడు.
In Romania, an Indian construction worker, Vipan Kumar, jumped into an icy lake in the city of Craiova to save a 5-year-old girl from drowning. He kept her above water until firefighters arrived. The city’s mayor plans to grant him the title of Honorary Citizen 🇷🇴🇮🇳 pic.twitter.com/YBFqQO3tlv
— 🇪🇺 (@ChristianEUR0PE) January 18, 2026
గౌరవ పౌరసత్వంతో సత్కారం
విపన్ కుమార్ చేసిన ఈ మానవతా ప్రయత్నానికి మరియు సాహసానికి గుర్తింపుగా ఆయనకు క్రాయోవా నగర గౌరవ పౌరసత్వం (Honorary Citizen) ఇవ్వనున్నట్లు మేయర్ లియా ఓల్గుటా వాసిలెస్కు ప్రకటించారు. ఆయన నిస్వార్థ గుణం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిస్తున్నామని మేయర్ తెలిపారు. గౌరవ పౌరసత్వం ఇవ్వాలన్న ప్రతిపాదనను స్థానిక కౌన్సిల్ దీనిని అధికారికంగా మంజూరు చేసిందన్నారు. దీని ద్వారా కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. త్వరలోనే రెసిడెన్స్ పర్మిట్ (నివాస అనుమతి) పొందనున్నారు.
మరోవైపు విపన్ కుమార్ సాహసాన్ని ఆయన కంపెనీ యజమాని కూడా అభినందించారు. భారతదేశంలో ఉన్న ఆయన కుటుంబాన్ని, ఎనిమిదేళ్ల కుమార్తెను కలుసుకునేందుకు వీలుగా కంపెనీ తరపున విమాన టికెట్లు/ప్రయాణ ఖర్చులు బహుమతిగా ఇవ్వాలని యజమాని యోచిస్తున్నారు. కాగా 2025 జూన్లో విపన్ కుమార్ రొమేనియా వెళ్లారు. డోల్జ్ కౌంటీలోని మాలు మారే అనే ప్రాంతంలో ఒక నిర్మాణ సంస్థలో అన్స్కిల్డ్ లేబర్గా పనిచేస్తున్నారు.
ఇదీ చదవండి: మొన్న ప్రణీత్, ఇపుడు మధుర్ విర్లీ : వీడియో వైరల్


