నేపిడా: సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేలా మయన్మార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరాలకు పాల్పడే నేరస్థులకు మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించేలా రూపొందించిన కఠినమైన 'యాంటీ-ఆన్లైన్ స్కామ్ బిల్లు' కు మంగళవారం ఆమోదం తెలిపింది.
గత కొంతకాలంగా దేశ సరిహద్దు ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని ఆన్లైన్ మోసాలు, క్రిప్టోకరెన్సీ స్కామ్లు, అక్రమ రిక్రూట్మెంట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే సైబర్ నేరాలను ఉక్కుపాదంతో అణచివేయడానికి ఈ నూతన చట్టాన్ని తీసుకువచ్చినట్లు అక్కడి అధికారులుపేర్కొన్నారు.
చట్టం ప్రకారం "ఆన్లైన్ స్కామ్లు చేసేలా బలవంతం చేయడానికి వేరే వ్యక్తులపై హింస, హింసించడం, చట్టవిరుద్ధమైన అరెస్టు నిర్బంధం లేదా క్రూరమైన ప్రవర్తనకు పాల్పడితే వారికి 10 సంవత్సరాల నుండి జీవిత ఖైదుతో పాటు మరణశిక్ష విధించబడుతుంది. ఒకవేళ ఈ నేరాల వల్ల మరణం సంభవిస్తే మరణశిక్ష విధించబడుతుంది" అని చట్టం చేసింది.
అదేవిధంగా "ఆన్లైన్ స్కామ్ సెంటర్ను నడిపేవారు" "డిజిటల్ కరెన్సీ స్కామ్లు చేసేవారికి" గరిష్టంగా జీవిత ఖైదు విధించేలా డ్రాఫ్ట్ బిల్లులో నిబంధన పొందుపరిచారు. ఈ చట్టం ద్వారా ఆన్లైన్ మోసాలకు పాల్పడేవారికి, అలాగే అందుకు సహకరించే వారికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.
నేపథ్యం
యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన మయన్మార్లో ఇంటర్నెట్ మోసాల ఫ్యాక్టరీలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆగ్నేయాసియాలో అభివృద్ధి చెందుతున్న స్కామ్ ఆర్థిక వ్యవస్థలో ఇది భాగమైంది. రొమాన్స్, క్రిప్టోకరెన్సీ ఇన్వెస్ట్మెంట్ మోసాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ వినియోగదారులను వీరు టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిని అరికట్టేలా మయన్మార్ కఠిన చట్టం అమలు చేసింది.


