ప్రభుత్వానికి ఎదురు తిరిగితే ఇదే గతి... నడివీధిలో ఇద్దరికి ఉరి | Iran Hangs Two Anti Government Protesters In Public | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి ఎదురు తిరిగితే ఇదే గతి... నడివీధిలో ఇద్దరికి ఉరి

Jul 28 2026 4:33 PM | Updated on Jul 28 2026 4:37 PM

  Iran Hangs Two Anti Government Protesters In Public

టెహ్రాన్: ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో సంబంధం ఉన్న కేసుల్లో ఇద్దరు వ్యక్తులకు విధించిన ఉరిశిక్షను అమలు చేసినట్లు ఇరాన్ న్యాయవ్యవస్థ మంగళవారం ప్రకటించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ ఉరిశిక్షను బహిరంగ ప్రదేశంలో అమలు చేశారు.

"అబోల్ఫజల్ సెపాహి, అమీర్-హొస్సేన్ సఫారీకి విధించిన మరణదండనను ఈ ఉదయం అమలు చేశాం" అని న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ వెల్లడించింది. ఇక మెహర్ వార్తా సంస్థ కథనం ప్రకారం.. మధ్య ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లోని మలెక్‌షహర్ నగరంలోని ఒక చౌరస్తాలో ప్రజల సమక్షంలో ఉరిశిక్ష అమలు చేశారు.

జనవరి 8న ఈ ఇద్దరు మచెట్లు, కత్తులతో పోలీసు అధికారులపై దాడి చేశారని, వారిని రహదారి సూచిక బోర్డులకు కట్టేసి నేలపై ఈడ్చారని, పెట్రోలు పోసి నిప్పంటించారని మిజాన్ తెలిపింది. వారిపై "మొహారెబెహ్ (దేవుడిపై యుద్ధం చేయడం)" అనే అభియోగంతో పాటు, ఆయుధాలు ప్రదర్శించి ప్రజల్లో భయం, భీతావహ పరిస్థితులు సృష్టించడం, దేశంలో శాంతి భద్రతలకు తీవ్ర అంతరాయం కలిగించే చర్యలకు పాల్పడడం వంటి ఆరోపణలు నమోదయ్యాయని పేర్కొంది.

డిసెంబర్ చివరలో జీవన వ్యయం పెరగడంపై ప్రారంభమైన నిరసన ఉద్యమం వేగంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలుగా మారింది. జనవరి 8, 9 తేదీల్లో అవి గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ హింసలో 3,000 మందికి పైగా మరణించారని ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలకు అమెరికా, ఇజ్రాయెల్ ప్రోత్సహించిన "ఉగ్రవాద చర్యలే" కారణమని వారు ఆరోపించారు. అయితే విదేశాల్లో ఉన్న హక్కుల సంస్థలు మాత్రం భద్రతా బలగాలు నిరసనకారులపై కాల్పులు జరిపాయని చెబుతున్నాయి.

ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక జోక్యం చేసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేశాయి. దీంతో పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత దేశంలో ఘర్షణలు, నిరసనలకు సంబంధించి అరెస్టులు, ఉరిశిక్షల అమలు పెరిగాయి.

జూలై 19న కూడా ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లో ఇదే తరహా ఆరోపణలపై మరో ఇద్దరికి ఉరిశిక్ష అమలు చేశారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం, ప్రపంచంలో అత్యధిక ఉరిశిక్షలు అమలు చేసే దేశాల జాబితాలో చైనా తర్వాత ఇరాన్ రెండో స్థానంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement