చుక్కలు చూపిస్తున్న సువేందు.. అభిషేక్ ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా! | TMC Abhishek slams Bengal police For Search at home | Sakshi
Sakshi News home page

చుక్కలు చూపిస్తున్న సువేందు.. అభిషేక్ ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా!

Jun 13 2026 12:34 PM | Updated on Jun 13 2026 12:47 PM

TMC Abhishek slams Bengal police For Search at home

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్‌ బెనర్జీ ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. సోదాల పేరుతో పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు.. అభిషేక్‌ ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్లు టీఎంసీ వర్గాలు ఆరోపించాయి. ఈ విషయం తెలుసుకున్న మమతా బెనర్జీ.. హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాళీఘాట్‌లోని అభిషేక్‌ బెనర్జీ నివాసంలో శనివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో దర్యాప్తు నిమిత్తం ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించాయి. ఈ సందర్బంగా సల్బోని ప్రాంతంలోని ఓ భూమికి సంబంధించిన కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్‌ బెనర్జీ వ్యక్తిగత సహాయకుడు సుమిత్ రాయ్ కోసం తాము గాలిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. అభిషేక్‌ నివాసంలో నాలుగు గంటలకు పైగా సోదాలు నిర్వహించారు. అయితే, పోలీసులతో పాటు కేంద్ర భద్రతా బలగాలు కూడా తనిఖీల్లో పాల్గొనడంతో టీఎంసీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న వెంటనే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. అభిషేక్ ఇంటికి చేరుకున్నారు. ఆమె రాకతో అక్కడ రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. టీఎంసీ నేతలు ఈ సోదాలను రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణించారు. సోదాల అనంతరం మీడియాతో మాట్లాడిన అభిషేక్ బెనర్జీ.. పోలీసులు అతిగా వ్యవహరించారని ఆరోపించారు. తన నివాసంలోకి గేటు తాళాలు బద్దలు కొట్టి ప్రవేశించారని అన్నారు. తాను ఏమైనా దాచిపెట్టానా? అంటూ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తగిన న్యాయపరమైన చర్యలు పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు.

మరోవైపు.. బెంగాల్‌లో మున్సిపాలిటీ నియామకాల కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు టీఎంసీ ఎమ్మెల్యే మదన్మిత్ర నివాసంపై దాడులు చేశారు. సోదాలు నిర్వహిస్తుండగా అతడి మంచం కింద నగదు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ పరిణామాలన్నీ 2026 బెంగాల్ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. ఒకవైపు దర్యాప్తు సంస్థల చర్యలు, మరోవైపు టీఎంసీ చేస్తున్న రాజకీయ కక్షసాధింపు ఆరోపణల మధ్య ఈ వ్యవహారం ఎటువైపు మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement