ఢిల్లీ: వాహనదారులకు అలెర్ట్. పశ్చిమాసియా యుద్ధం కారణంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలో కేంద్రం పెట్రోల్లో ఇథనాల్ కలిపి అమ్మకాలు నిర్వహించేలా డ్రాఫ్ట్ బిల్లు (ప్రతిపాదిత చట్టం) సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే, ఆ డ్రాఫ్ట్ బిల్లులో గతంలో చెప్పినట్లుగా పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలిపి అమ్మకాలు నిర్వహించేలా కాకుండా.. 85శాతం ఇథనాల్.. 15శాతం పెట్రోల్ మాత్రమే వాహనాల్లో వినియోగించేలా కేంద్రం ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. భారత్ తన ఇంధన అవసరాల కోసం దాదాపు 90శాతం విదేశాల నుంచి ఎక్కువగా గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. రానున్న రోజుల్లో చమురు దిగుమతులు తగ్గించుకునేలా ప్రయత్నాలు ప్రారంభించింది
ఇదే అంశంపై పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖకు సంబంధం ఉన్న సీనియర్ ప్రభుత్వ అధికారులు జాతీయ మీడియాతో మాట్లాడారు. త్వరలోనే ప్రభుత్వం ఇథనాల్ 85 (ఈ85) అంశాన్ని డ్రాఫ్ట్ రూపంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. అంతేకాదు ఇథనాల్ 85పై ఇటు ప్రభుత్వంలో అటు మార్కెట్లో సైతం ఏకాభిప్రాయం ఉంది ప్రాథమిక పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ85 కోసం ఇంజన్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. మార్కెట్లో విడుదలయ్యేందుకు రెండేళ్ల సమయం పడుతుందని అంచనా.
మరో అధికారి మాట్లాడుతూ..ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు సైతం 15శాతం పెట్రోల్,85శాతం ఇథనాలు కలిపి అమ్మకాలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న డ్రాఫ్ట్ బిల్లుపై అంగీకారం తెలిపాయని,త్వరలో అధికారిక ప్రకటన చేస్తాయన్న ఆయన.. ‘మార్కెట్ ఏకాభిప్రాయం ఇప్పటికే కుదిరింది. ఈ85 కోసం వాహనాల ప్రాథమిక పరీక్షలు కూడా పూర్తయ్యాయి’అని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న ఈ20 పెట్రోల్కు భిన్నంగా, ఈ85ను ఒక ప్రత్యేక ఇంధన గ్రేడ్గా ప్రవేశపెట్టనున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ20 వేరియంట్లో ఇథనాల్ మిశ్రమాన్ని 27శాతం వరకు కలపవచ్చు.
ఇంధన సంక్షోభం మధ్య కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయం దేశానికి కీలక మలుపు కానుంది. పెట్రోల్పై ఆధారాన్ని తగ్గించి, దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్ వినియోగాన్ని పెంచడం ద్వారా రైతులకు మద్దతు లభించనుంది. పర్యావరణానికి ప్రయోజనం కలిగించడమే కాకుండా, చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే అవకాశం ఉంది. అయితే, కొత్త ఇంజిన్లు, మౌలిక సదుపాయాలు, వినియోగదారుల అవగాహన వంటి సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ఈ85 ప్రవేశం భారత ఇంధన రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.


