విమాన ప్రయాణాల్లో ప్రయాణికులకు చాలా టెన్షన్ ఉంటుంది. విమానంలో ఎలాంటి వస్తువులు తీసుకెళ్లవచ్చు అనే సందేహాలు మొదలు, సయానికి సెక్యూరిటీ చెకప్ ముగించుకుని గేట్లోకి వెళ్లడం, లగేజీ నిర్దేశించిన బరువులో ఉందా లేదా చూసుకోవడం దాకా చాలా తతంగమే ఉంటుంది. ముఖ్యంగా పరిమితి కంటే లగేజీ బరువు కాస్త ఎక్కువైనా ప్యాసెంజర్లకు చుక్కలే. అదనపు చార్జీల (Excess baggage fee) మోత మోగుతుంది. ఇక్కడే చాలా వాదోపవాదాలు జరుగుతుంటాయి. ఇటీవల అర్జెంటీనాలోని ఒక విమానాశ్రయంలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఎక్స్ట్రా లగేజీ ఫీజుకు సంబంధించిన హైడ్రామా ఊహించని రేంజ్కి చేరింది.
అసలేం జరిగింది?
‘మిర్రర్ యూకే’ కథనం ప్రకారం.. అర్జెంటీనాలోని బ్యూనస్ ఐరెస్ (Buenos Aires) లో గ ‘జార్జ్ న్యూబెరీ ఎయిర్పార్క్’ లో జెట్స్మార్ట్ (JetSmart) విమానంలో ఈ సంఘటన జరిగింది. కొర్డోబాకు వెళ్లాల్సిన ఆ విమానం ఎక్కేందుకు ఒక మహిళా ప్రయాణికురాలు వచ్చింది. అయితే, ఆమె పరిమితికి మించి క్యాబిన్ లగేజీని తీసుకురావడంతో, దానికి అదనపు రుసుము చెల్లించాలని ఎయిర్పోర్ట్ సిబ్బంది కోరారు. దానికి ఆమె నిరాకరించడంతో బోర్డింగ్ గేట్ వద్ద వివాదం మొదలైంది.
గేట్ వద్ద గొడవ జరుగుతున్నప్పటికీ, ఆమె సిబ్బంది కళ్లుగప్పి ‘ఫ్లైట్ JA 3104’ లోపలికి వెళ్ళిపోయింది. ప్రామాణిక బోర్డింగ్ నియమాలను ఉల్లంఘించి ఆమె విమానం ఎక్కేసిందని గ్రహించిన సిబ్బంది, వెంటనే భద్రతా సిబ్బందిని ఎలర్ట్ చేశారు.
నిజానికి బోర్డింగ్ గేట్ వద్దే ముగిసిపోవాల్సిన ఈ గొడవ, ఆమె విమానం లోపలికి వెళ్లడంతో మరింత వివాదాస్పందగా మారింది. అప్పటికే ప్రయాణికులంతా తమ సీట్లలో కూర్చుని, విమానం టేకాఫ్కు సిద్ధమవుతోంది. ఆ సమయంలో పోలీసులు విమానంలోకి ప్రవేశించి, ఆమెను కిందకు దించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆమెను బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, ఆ మహిళ ఒక్కసారిగా ఒక మహిళా పోలీస్ అధికారిణి కుడి చేతిపై గట్టిగా కొరికింది. ఈ ఊహించని ఘటనతో విమానంలోని ప్రయాణికులంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఇదీ చదవండి: పెళ్లికి రావాల్సినవాడు.. శవమై వచ్చాడు
తీవ్ర ఘర్షణ తర్వాత ఎయిర్పోర్ట్ పోలీసుల ఎట్టకేలకు ఆమెను నియంత్రించి, విమానం నుండి కిందకు దించేశారు. దీనిపై అర్జెంటీనా 'నేషనల్ క్రిమినల్ అండ్ కరక్షనల్ ఫెడరల్ కోర్ట్ నెం. 3' ఆమెను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. గాయపడిన మహిళా అధికారిణి, షిఫ్ట్ సూపర్వైజర్, జెట్స్మార్ట్ విమాన సిబ్బంది నుండి దర్యాప్తు అధికారులు స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ప్రస్తుతం కోర్టు ఈ కేసును పరిశీలిస్తోంది.
ఇదీ చదవండి: సీజేపీ ధర్నాలో ఆసక్తికర డిమాండ్, విద్యామంత్రిగా ఆయన?


