ఇస్లామాబాద్: వాయవ్య పాకిస్థాన్లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని భద్రతా తనిఖీ కేంద్రం పైకి దూసుకెళ్లారు. ఈ దుర్ఘటనలో 12 మంది సైనికులు, ఇద్దరు పోలీసులు,ఓ అటవీ శాఖ ప్రభుత్వ అధికారి సహా మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భీకర దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన పాక్ సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో 12 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఈ మేరకు శుక్రవారం పాకిస్థాన్ సైన్యం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న వాయవ్య ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్లోని టాంక్ జిల్లాలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ఉగ్రవాదులు భద్రతా వలయాన్ని ఛేదించి లోపలికి చొరబడటానికి ప్రయత్నించారని, అయితే సైనికులు వారిని అడ్డుకోవడంతో.. ఉగ్రవాదులు పేలుడు పదార్థాల వాహనాన్ని చెక్ పోస్ట్ వెలుపలి రక్షణ గోడకు బలంగా ఢీకొట్టారని ఆర్మీ తెలిపింది. ఈ భారీ పేలుడు దాటికి అక్కడి భద్రతా మౌలిక సదుపాయాలు,భవనం తీవ్రంగా దెబ్బతిన్నాయి.
స్థానిక తాలిబాన్ ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది. ఈ ఆపరేషన్లో తమ సంస్థకు చెందిన నలుగురు ఆత్మాహుతి బాంబర్లు పాల్గొన్నట్లు వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో వాయవ్య పాకిస్థాన్లో ఉగ్రవాద కార్యకలాపాలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి.


