ముంబై: మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ వెలుగుచూసింది. ఓ జాతరలో కొనుగోలు చేసిన బెడ్షీట్పై ‘మేడ్ ఇన్ పాకిస్తాన్’ (Made in Pakistan) అనే లేబుల్ కనిపించడం తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియోను మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, పాకిస్తాన్కు చెందిన వస్తువులు భారత్లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పూణే సమీపంలోని పింప్రి-చించ్వాడ్ పరిధిలో ప్రసిద్ధ శ్రీ మోరయా గోసావి ఆలయంలో బుధవారం సంకష్ట చతుర్థి జాతర జరిగింది. ఈ జాతరకు పూణేకు చెందిన ఓ మహిళ వెళ్లింది. జాతరలో ఆమె.. బెడ్షీట్ను కొనుగోలు చేసింది. కొనుగోలు సమయంలో దానిపై ఎలాంటి అనుమానాస్పద గుర్తులు లేవు. అయితే, ఇంటికి వెళ్లాక దానిని వాష్ చేయడంతో ఒక మూలన దాచిన లేబుల్ స్పష్టంగా కనిపించింది. దానిపై మేడ్ ఇన్ పాకిస్తాన్ అని రాసి ఉండటం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో, వెంటనే దీన్ని ఫోన్లో రికార్డు చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో పోలీసులు గుర్తించారు.
पुणे के चिंचवड़ में मोरया गोसावी मंदिर के संकष्टी चतुर्थी के दिन मेले में मेड इन पाकिस्तान चीजों की बिक्री
हिंदू महिला ने किया उजागर वीडियो हुआ वायरल pic.twitter.com/JN859goEf9— Amrendra Bahubali 🇮🇳 (@TheBahubali_IND) June 5, 2026
ఈ వైరల్ వీడియోపై తక్షణమే స్పందించిన పింప్రి-చించ్వాడ్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బెడ్షీట్ను అమ్మిన సదరు వీధి వ్యాపారి ఎవరు? అతడికి ఈ స్టాక్ ఎక్కడి నుంచి సరఫరా అయింది? స్థానిక మార్కెట్లోకి ఈ పాకిస్తాన్ వస్తువులు ఎలా ప్రవేశించాయి? అనే సప్లై చైన్ నెట్వర్క్ను ఛేదించే పనిలో పడ్డారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులు పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్కు లేఖ రాశారు. అయితే, మహారాష్ట్రలోని శంభాజీనగర్ (ఔరంగాబాద్) జిల్లాలో కూడా ‘మేడ్ ఇన్ పాకిస్తాన్’ అని ఉన్న కొన్ని కాస్మెటిక్ ఉత్పత్తులను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో జాతరలు, స్థానిక మార్కెట్లలో విక్రయించే వస్తువులపై నిఘా వర్గాలు ప్రత్యేక నిఘా పెట్టాయి.
ఇదిలా ఉండగా.. 2019లో జరిగిన పుల్వామా అటాక్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య వాణిజ్య సంబంధాలు గణనీయంగా తగ్గాయి. భారత్.. పాకిస్తాన్కు ఇచ్చిన Most Favoured Nation (MFN) హోదాను రద్దు చేసింది. అనంతరం పాకిస్తాన్ కూడా అనేక భారతీయ వస్తువుల దిగుమతులపై పరిమితులు విధించింది. అందువల్ల ‘Made in Pakistan’ అనే లేబుల్ ఉన్న వస్తువు భారత మార్కెట్లో కనిపిస్తే అక్రమంగా దేశంలోని వచ్చేనట్టే లెక్క. ఈ నేపథ్యంలో సరిహద్దు భద్రత, దిగుమతి నియంత్రణలు, అక్రమ సరఫరా గొలుసులపై ప్రశ్నలు లేవనెత్తుతాయి.


