నిరసనల వేదిక ‘జంతర్ మంతర్’ అసలు కథ! | Delhi Dissent Hub Jantar Mantar story | Sakshi
Sakshi News home page

నిరసనల వేదిక ‘జంతర్ మంతర్’ అసలు కథ!

Jun 6 2026 1:13 PM | Updated on Jun 6 2026 1:19 PM

Delhi Dissent Hub Jantar Mantar story

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్.. నేడు దేశంలో ఏ చిన్న అన్యాయం జరిగినా, హక్కుల కోసం పోరాడాలన్నా గుర్తుకువచ్చే ఏకైక చిరునామా. తాజాగా కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నీట్-యూజీ పేపర్ లీక్ వివాదంపై చేపట్టిన భారీ నిరసనతో ఈ ప్రాంతం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఒకప్పుడు గ్రహాల గమనాన్ని లెక్కించే వైజ్ఞానిక కేంద్రంగా వెలిసిన ఈ కట్టడం, దేశ రాజకీయాలను శాసించే నిరసనల హబ్‌గా ఎలా మారింది? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర ఏంటి?

ఖగోళ కేంద్రంగా జంతర్ మంతర్ ఆవిర్భావం
నిజానికి జంతర్ మంతర్ అనేది రాజకీయాలకు సంబంధించిన స్థలం కాదు. 18వ శతాబ్దంలో అంబర్ మహారాజు సవాయ్ జైసింగ్ II దీనిని నిర్మించారు. సంస్కృతంలోని 'జంత్ర' (ఖగోళ పరికరం) అనే పదం నుండి దీనికి 'జంతర్ మంతర్' అనే పేరు వచ్చింది. ఆ కాలంలో సమయాన్ని, నక్షత్రాలు, గ్రహాల గమనాన్ని ఖచ్చితంగా లెక్కించడానికి ఒక వైజ్ఞానిక ప్రయోగశాలగా దీనిని ఏర్పాటు చేశారు. దీని చుట్టూ ఉన్న భారీ నిర్మాణాలు శాస్త్రీయ పరికరాలుగా పనిచేసేవి.

బోట్ క్లబ్ నుండి జంతర్ మంతర్ రోడ్డుకు మారిన వేదిక
1993 కంటే ముందు ఢిల్లీలో నిరసనలు, ధర్నాలకు ప్రధాన వేదిక ఇండియా గేట్ సమీపంలోని 'బోట్ క్లబ్ లాన్స్'గా ఉండేది. అయితే, 1988లో జరిగిన ఒక భారీ రైతు ధర్నా కారణంగా దేశ రాజధానిలో సాధారణ జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నగరంలో తీవ్ర ఆటంకాలు కలగడంతో, అధికారులు బోట్ క్లబ్ వద్ద నిరసనలపై ఆంక్షలు విధించారు. దానికి ప్రత్యామ్నాయంగా, పార్లమెంట్‌కు సమీపంలో ఉంటూ.. ప్రజాస్వామ్య యుతంగా నిరసనలు తెలుపుకోవడానికి వీలుగా ఉండే ‘జంతర్ మంతర్ రోడ్డు’ను అధికారిక నిరసన స్థలంగా ప్రకటించారు. అలా 1993 నుండి ఇది ఉద్యమాల వేదికగా రూపాంతరం చెందింది.

దేశాన్ని కదిలించిన చారిత్రక ఉద్యమాలు
గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఎన్నో చారిత్రక మరియు సామాజిక మార్పులకు జంతర్ మంతర్ సాక్ష్యంగా నిలిచింది.
అన్నా హజారే ఉద్యమం (2011): అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే నేతృత్వంలో సాగిన జన లోక్‌పాల్ ఉద్యమం ఇక్కడి నుంచే దేశాన్ని కదిలించింది. ఈ ఉద్యమ ఫలితంగానే తదనంతరం ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ ఆవిర్భవించింది.
నిర్భయ ఆందోళనలు (2012): దేశవ్యాప్తంగా ప్రజాగ్రహాన్ని రగిల్చిన నిర్భయ హత్యాచార ఘటనపై పెద్ద ఎత్తున యువత, పౌరులు ఇక్కడే చేరి న్యాయం కోసం పోరాడారు.
ఇతర ప్రముఖ నిరసనలు: రోహిత్ వేముల మరణం తర్వాత జరిగిన విద్యార్థి ఆందోళనలు, ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ కోసం మాజీ సైనికులు చేసిన సుదీర్ఘ పోరాటాలు ఇక్కడే సాగాయి.

నిషేధం.. ఆపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
2017లో పర్యావరణ కారణాలు, స్థానికులకు కలిగే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్’జంతర్ మంతర్ వద్ద నిరసనలపై నిషేధం విధించింది. అయితే శాంతియుతంగా నిరసన తెలపడం అనేది పౌరుల రాజ్యాంగబద్ధమైన హక్కు అని స్పష్టం చేస్తూ 2018లో గౌరవ సుప్రీంకోర్టు ఇక్కడ ధర్నాలు చేసుకునే ప్రజాస్వామ్య హక్కును పునరుద్ధరించింది.

ఇది కూడా చదవండి: ‘బొద్దింకలు’ భయపడవు, చావవు: అభిజీత్ దిప్కే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement