జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్‌ పార్టీ భారీ ఆందోళన | Abhijeet Dipke Leads Youth Protest at Jantar Mantar Security Beefed Up Across Delhi | Sakshi
Sakshi News home page

జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్‌ పార్టీ భారీ ఆందోళన

Jun 6 2026 11:23 AM | Updated on Jun 6 2026 11:45 AM

Abhijeet Dipke Leads Youth Protest at Jantar Mantar Security Beefed Up Across Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం ఉదయం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ‘కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత భారీ ఎత్తున నిరసన చేపట్టారు. సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఈ డిజిటల్ ఉద్యమ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అమెరికా నుంచి నేరుగా ఢిల్లీ చేరుకుని, ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తుండటంతో జంతర్ మంతర్ పరిసరాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

 


అమెరికా నుంచి జంతర్ మంతర్‌కు..
‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు, 30 ఏళ్ల అభిజీత్ దీప్కే అమెరికాలోని బోస్టన్ నగరం నుండి శనివారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుండి ఆయన నేరుగా నిరసన వేదిక వైపు కదిలారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. నిరసనకు వచ్చే వారు తమతో పాటు ఒక పుస్తకాన్ని, జాతీయ జెండాను తీసుకురావాలని ‘ఎక్స్’వేదికగా కోరారు. గత నెలలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలపై  ప్రారంభమైన ఈ సోషల్ మీడియా పార్టీ, నేడు యువత సమస్యలపై గళమెత్తే వేదికగా మారి, దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా నిలిచింది.
 

 

ఢిల్లీలో భారీ భద్రత.. పోలీసుల మోహరింపు
ఈ నిరసన పిలుపు నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ సరిహద్దులతో పాటు కేంద్ర ఢిల్లీకి వచ్చే ప్రధాన రహదారులపై వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 1000 మందికి పైగా పోలీసులను, పారామిలటరీ బలగాలను మోహరించారు. తొలుత అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నప్పటికీ, ఆ తర్వాత ఆందోళనకారులకు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు అనుమతి లభించిందని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ స్పష్టం చేశారు. దీంతో ఉదయం నుంచే విద్యార్థులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు.

పెరుగుతున్న మద్దతు
ఈ నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుండి మద్దతు లభిస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి జూన్ 5 లోగా రాజీనామా చేయని పక్షంలో తాము కూడా ఈ ఆందోళనలో భాగస్వామ్యం అవుతామని విద్యా సంస్కర్త సోనమ్ వాంగ్‌చుక్ ఇదివరకే ప్రకటించారు. మరోవైపు అభిజీత్ స్వగ్రామమైన సంతుక్ పింప్రి గ్రామస్తులు, స్నేహితులు ఈ నిరసన తీవ్రమైన సమస్యలపై జరుగుతోందని, ఇది శాంతియుతంగా ముగియాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా జనరేషన్ జెడ్ యువతను విశేషంగా ఆకట్టుకున్న ఈ 'కాక్రోచ్‌ జనతా పార్టీ' నిరసనలు, భారత రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలుస్తాయని పార్టీ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement