రూ.15 వేల కోట్ల లగ్జరీ రిసార్ట్‌ : ట్రంప్‌కి భారీ ఝలక్‌ | Jared Kushner-backed luxury resort sparking outrage in Albania | Sakshi
Sakshi News home page

రూ.15 వేల కోట్ల లగ్జరీ రిసార్ట్‌ : ట్రంప్‌కి భారీ ఝలక్‌

Jun 6 2026 12:15 PM | Updated on Jun 6 2026 1:00 PM

Jared Kushner-backed luxury resort sparking outrage in Albania

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అల్బేనియా అడ్రియాటిక్ తీరంలో ట్రంప్‌ అల్లుడు జారెడ్ కుష్నర్ నిర్మించతలపెట్టిన లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్ట్‌పై  పెద్ద దుమారం చెలరేగింది. వీరు తలపెట్టిన సుమారు రూ. 15,232 కోట్ల భారీ ప్రాజెక్ట్‌ అక్కడి పర్యావరణ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తుందంటూ అల్బేనియా రాజధాని టిరానా నగర కేంద్రంలో  యువత  తీవ్ర నిరసనలకు దిగింది.  జారెడ్ కుష్నర్ అఫినిటీ పార్ట్‌నర్స్ మద్దతుతో, ఇవాంకా ట్రంప్ ప్రమేయంతో రూపొందుతున్న ప్రతిపాదిత  విలాసవంతమైన పర్యాటక ప్రాజెక్టే ఈ ఆగ్రహానికి కేంద్ర బిందువు. అసలేంటీ ప్రాజెక్ట్‌ తెలుసుకుందాం.

పర్యావరణ నష్టం, చట్టపరమైన లోపాలపై ప్రజలు, పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని టిరానా (Tirana) లో ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలని, భూములను అసలు యజమానులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వరుస నిరసనలు  నాలుగో  రోజుకు చేరుకున్నాయి. 

సజాన్ ద్వీపంలో, తీరప్రాంత నగరమైన వ్లోరా సమీపంలోని జ్వెర్నెక్ వద్ద నిర్మాణం కానున్న  ఈ  ప్రాజెక్ట్‌తో రక్షిత జాతి అయిన ఫ్లెమింగోలకు,  సముద్ర తామేళ్లకు, అలాగే రక్షిత చిత్తడి నేలల ప్రాంతంలోని ఇతర జాతులకు ముప్పు కలిగిస్తాయని వారు అంటున్నారు. తీరప్రాంతంలో బుల్డోజర్లు రావడం, బీచ్‌లకు వెళ్లకుండా  ముళ్ల కంచెలు వేయడంతో స్థానికులు, నిరసనకారులు సెక్యూరిటీ గార్డులతో ఘర్షణకు దిగారు. 

ఇదీ చదవండి: పెళ్లికి రావాల్సినవాడు.. శవమై వచ్చాడు

విదేశీ డెవలపర్‌లకు భూమిని అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకారులు గులాబీ రంగు ఫ్లెమింగో కటౌట్‌లు, అల్బేనియా నాట్‌ ఫర్‌  సేల్‌ అనే ప్లకార్డ్‌లతో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. అంతేకాదు అవినీతి ఆరోపణలుఎదుర్కొంటున్న పీడీ నాయకుడు సాలీ బెరిషాతో పాటు  ప్రధానమంత్రి రామాను కూడా జైలులో పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏడీ  రామా కార్యాలయం ముందు ప్రతిరాత్రి జరుగుతున్న ర్యాలీలను పోలీసులు వాటర్‌ కెనాన్లతో అదుపు చేస్తున్నారు.

మరోవైపు వ్యోసా-నార్తా రక్షిత పర్యావరణ ప్రాంతాన్ని ఈ ప్రాజెక్ట్ ధ్వంసం చేస్తుందని దాదాపు 40కి పైగా స్వచ్ఛంద సంస్థలు (NGOs) ఆందోళన వ్యక్తం చేస్తూ, పనులను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వానికి లేఖ రాశాయి. ప్రతిపాదిక ప్రాజెక్ట్‌ సుమారు 10,000 గదులతో కూడిన ఒక కొత్త నగరం అవుతుందని, ఇది వన్యప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని అల్బేనియా  పర్యావరణవేత్త జోని వోర్ప్సీ విమర్శించారు.



2024లో అల్బేనియాలోని అడ్రియాటిక్ తీరంలో లగ్జరీ హోటళ్లు, విల్లాలు నిర్మించనున్నట్లు జారెడ్ కుష్నర్, ఆయన భార్య ఇవాంకా ట్రంప్  ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌ను రక్షిత ప్రాంతమైన వ్యోసా-నార్తా (Vjosa-Narta) డెల్టా మరియు ఒకప్పుడు రహస్య కమ్యూనిస్ట్ సైనిక స్థావరంగా ఉన్న సజాన్ (Sazan) ద్వీపంలో నిర్మించాలని ప్రణాళికలు వేశారు. సుమారు 1.6 బిలియన్‌ డాలర్లు (USD) ఉంటుందని అంచనా. అయితే, సజాన్ ప్రభుత్వ ఆస్తి అయినందున, ఇందులో ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉంటుందని అల్బేనియా ప్రధాని కార్యాలయం తెలిపింది. ఇక్కడ దాదాపు 4 బిలియన్ యూరోల ప్రాజెక్ట్ ఉందని, దీని వెనుక ఖతార్‌కు చెందిన 'పవర్ ఇంటర్నేషనల్ హోల్డింగ్' సహ-యజమానులు ఉన్నారని ప్రభుత్వం పేర్కొంది. 

అల్బేనియాలో, పర్యావరణ పరిరక్షణతో సహా ప్రతిదీ పారదర్శకంగానే ఉందని, చాలా బాధ్యతాయుతంగా ఆ ప్రాజెక్ట్‌ను చేపట్టామని,  స్థానికులకు ఉద్యోగాలు, సంపద సృష్టించడంపై దృష్టి పెట్టామని కుష్నర్ వ్యాపార భాగస్వామి, ఆషర్ అబెహ్‌సెరా చెప్పారు.

విచారణ
అల్బేనియా ప్రత్యేక అవినీతి నిరోధక ప్రాసిక్యూటర్ కార్యాలయం ఈ ప్రాజెక్ట్‌పై విచారణ ప్రారంభించింది. రక్షిత ప్రాంత హోదాను ఎలా మార్చారు? పబ్లిక్ టెండర్లు లేకుండా కాంట్రాక్టులు ఎలా ఇచ్చారు? మరియు నిధుల మూలాలు ఎక్కడివి? అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది.

కాగా 1990లలో కమ్యూనిజం పతనం తర్వాత అల్బేనియాలో భూ వివాదాలు ఎక్కువయ్యాయి. కమ్యూనిస్ట్ పాలనలో 45 ఏళ్ల సంపూర్ణ జాతీయీకరణలో కోల్పోయిన తమ పూర్వీకుల భూములను తిరిగి పొందాలని వేలాది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ కోసం కేటాయించిన భూములపై కొందరు స్థానికులు హక్కులు కోరుతున్నారు. అలాగే, భూముల కొనుగోలుకు ఉపయోగించిన నిధుల మూలాలపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement