ఢిల్లీలోని జీడీ గోయెంకా పబ్లిక్ స్కూల్ సైన్స్ టీచర్ సోమా మండల్ ఈ ఏడాది గ్లోబల్ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డును గెలుచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 129 దేశాల నుంచి వచ్చిన 12,000 నామినేషన్లలో ఆమె ఈ ఘనత సాధించడం విశేషం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ అండ్ అసెస్మెంట్ (కేంబ్రిడ్జ్)లోని అంతర్జాతీయ విద్యా విభాగం సోమా గ్లోబల్ విజేతగా నిలిచిందని ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనిమిది మంది ఇతర ప్రాంతీయ విజేతలతో హోరాహోరీగా జరిగిన పోటీలో, సోమా 40 శాతం ప్రజా ఓట్లను సాధించి.. భారత్ నుంచి గెలిచిన తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా రికార్డు సృష్టించింది. సుమారు పదేళ్లకు పైగా బోధనా అనుభవం ఉన్న సోమా తన సైన్సు పాఠాలలో వాతావరణ విద్యను పొందుపరిచి..ఆ దిశగా విద్యార్థులను చైతన్యవంత చేయడమే కాదు, ఆచరణత్మక పరిష్కారాలను రూపొందించేలా ప్రోత్సహించారామె.
ఈ మేరకు సోమా మాట్లాడుతూ..తాను ఈ గ్లోబల్ అవార్డు ఎంపికైనట్లు తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయినట్లు పేర్కొంది. అంతేగాదే తన తల్లిదండ్రలు, సోదరుడితో కలిసి సోమా న్యూఢిల్లీలోని కేంబ్రిడ్జ్ కార్యాలయాలకు చేరుకుని ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుని అందుకున్నారు. ఈ పురస్కారం తోపాటు ఆమెకు కేంబ్రిడ్జ్ వర్చువల్ ఎన్రిచ్మెంట్ కోర్సులో ఒక స్థానాన్ని కూడా ప్రధానం చేశారు. నిజంగా ఇది తనకు ఎప్పటికీ మర్చిపోలేని క్షణం అని సోమా భావోద్వేగంగా చెప్పింది. ఇదిలా ఉండగా, కేంబ్రిడ్జ్లోని అంతర్జాతీయ విద్య గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రాడ్ స్మిత్ సోమాని అభినందిస్తూ..ఆమె రూపొందించిన వాతావరణ మార్పుల పాఠ్యప్రణాళిక చాలా స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు.
ప్రతిరోజూ తరగతి గదిలో విద్యార్థులకు తమ పర్యావరణ, గ్రహం పట్ల ఎలా ఉండాలో చెప్పడం నిజంగా అభినందనీయం అని అన్నారు. ప్రపంచంలో ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాలు వాతావరణ మార్పులు..అలాంటి దానిపై విద్యార్థుకు అవగాహన కల్పిస్తూ..ఆచరణాత్మక పరిష్కరాల దిశగా చైతన్య పరిచే ఆమె అభిరుచికి ధన్యవాదాలని అన్నారు.
అంతేగాదు నవంబర్ 2026 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్న కొత్త కేంబ్రిడ్జ్ పాఠ్యపుస్తకాల ముందు భాగంలోని 'ధన్యవాదాలు' పేజీలో కూడా ఆమె కనిపించనుంది. అలాగే సోమా ప్రాంతీయ విజేతగా, తన తరగతి కోసం 500 పౌండ్ల విలువైన పుస్తకాలను కూడా గెలుచుకుంది.


