ఇన్ బాక్స్
‘పెన్షన్ ప్రభుత్వాలు ఇచ్చే భిక్ష కాదు– అది ఉద్యోగుల హక్కు’ అని సుప్రీంకోర్టు 1982 డిసెంబర్ 17న డి.ఎస్. నకారా కేసులో తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం 2024 మార్చి నుండి ఇప్పటివరకు రిటైర్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు హక్కుగా చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలు రెండేళ్లయినా ప్రభుత్వం చెల్లించడం లేదంటూ కొంతమంది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రారంభంలో కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం చెల్లింపులు చేసింది కానీ తర్వాత ఆపింది. దీంతో కోర్టు ధిక్కారం కింద హైకోర్టులో కేసులు నమోదయ్యాయి.
రిటైర్మెంట్ బకాయిలు 10% వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని కోర్టు ఆదేశించినప్పటికీ కొంతమందికి మాత్రమే పూర్తి స్థాయిలో చెల్లించి, మరికొంత మందికి కొన్ని బిల్లులు మాత్రమే పాక్షికంగా చెల్లించి, పూర్తిగా చెల్లించామని కోర్టు ధిక్కరణకు మళ్లీ ప్రభుత్వం పాల్పడు తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయులు సర్వీసులో ఉన్నప్పుడు కొంత మంది హోమ్ లోన్, పర్సనల్ లోన్, ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తీసుకొన్న వారు ఇప్పటికీ వడ్డీలు భారీగా కడుతున్నారు. కాబట్టి గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయి లపై10 శాతం వడ్డీ చెల్లించాలి.
2024 మార్చి నుండి 2026 జూన్ వరకు దాదాపు 26,000 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందారు. ఎనిమిది నెలలుగా వివిధ పెన్షనర్ సంఘాలు ఉద్యమాలు చేస్తే వంద రోజులలో ఆరువేల కోట్లు చెల్లిస్తామని – వాటిలో మే నెలలో 2,000 కోట్లు, జూన్లో 2,000 కోట్లు, సెప్టెంబర్ 2025 వరకు కమ్యుటేషన్, జీపీఎఫ్ 100 శాతం చెల్లించామని ప్రకటించుకొంది ప్రభుత్వం. కానీ సెప్టెంబర్ 2025 వరకు ఎస్టీఓలో కమ్యుటేషన్ బిల్లు సబ్మిట్ చేసినప్పటికీ కొంతమందికి రాలేదు.
కొంతమందికి జీపీఎఫ్ కూడా రాలేదు. కొంతమంది బిడ్డల పెళ్లిళ్లు ఉన్నాయని పెండ్లి కార్డులు పెట్టినప్పటికీ వారికి జీపీఎఫ్ డబ్బులు అందకపోవడం దారుణం. కాబట్టి వారి టోకెన్ నంబర్లు పరిశీలించి, వారికి ఈ జూలై నెలలో చెల్లించాలి. రిటైర్ అయిన ఉద్యోగులందరికీ రిటైర్మెంట్ బకాయిలన్నింటినీ దశలవారీగా కాకుండా ఏక మొత్తంగా ఈ జూలై నెలలోనే చెల్లించాలి.
– కందుకూరి దేవదాసు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (తెలంగాణ) అసోసియేట్ అధ్యక్షుడు


