భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలు ఆధునికీకరణ దిశగా వేగంగా పయనిస్తున్నప్పటికీ, విద్యుత్ భద్రత అదే వేగంతో ముందుకు సాగడం లేదు. ఫలితంగా ప్రతి సంవ త్సరం వందలాది మంది ఉద్యోగులు, రైతులు, సాధారణ ప్రజలు విద్యుత్ ప్రమాదాలకు బలవుతున్నారు. వరుసగా చోటుచేసుకున్న విద్యుత్ ప్రమాదాలు యాదృచ్ఛికాలు కావు; విద్యుత్ భద్రతా వ్యవస్థలో ఎక్కడో తీవ్రమైన లోపం ఉందని సూచిస్తున్నాయి.
విద్యుత్ రంగంలో నాలుగు దశాబ్దాలుగా పనిచేసిన ఒక ఇంజినీర్గా నా అనుభవం చెబుతున్నది ఒక్కటే– విద్యుత్ ప్రమాదాల్లో ఎక్కువ శాతం నివారించగలిగేవే. ప్రతి ప్రమాదం వెనుక డిజైన్, నిర్వహణ, రక్షణ వ్యవస్థ, పర్యవేక్షణ, శిక్షణ, భద్రతా సంస్కృతి, జవాబుదారీతనం వంటి అనేక అంశాలు పరస్పరం ముడిపడి ఉంటాయి. కాబట్టి ప్రతి ప్రమాదాన్ని రూట్ కాజ్ ఎనాలిసిస్ (మూల హేతువు విశ్లేషణ) పద్ధతిలో విచారించి, అసలు కారణాలను గుర్తించడం తప్పనిసరి.
భారతదేశంలో విద్యుత్ భద్రతకు సంబంధించిన చట్టపరమైన వ్యవస్థ స్పష్టంగానే ఉంది. ఎలక్ట్రిసిటీ యాక్ట్– 2003, అలాగే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (మెజర్స్ రిలేటింగ్ టు సేఫ్టీ అండ్ ఎలెక్ట్రిక్ సప్లై) రెగ్యులేషన్స్... విద్యుత్ సంస్థలు, కాంట్రాక్టర్లు, ఉద్యోగులు పాటించాల్సిన భద్రతా ప్రమాణాలను నిర్దేశించాయి. అయినప్పటికీ ప్రమాదాలు ఎందుకు తగ్గడం లేదు? దానికి సమాధానం ‘వ్యవస్థాపరమైన భద్రతా సంస్కృతి’ లోపించడంలో ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత విచారణ కమిటీలు వేయడం, పరిహారం ప్రకటించడం, సంతాపం తెలియ జేయడం అవసరమే. కానీ ప్రమాదం జరగకముందే దానిని నివా రించే వ్యవస్థను నిర్మించడం ఇంకా ముఖ్యమైన బాధ్యత. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యుత్ రంగం ‘జీరో ఫెటాలిటీ విజన్’ అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తోంది. అంటే, విద్యుత్ ప్రమాదాల వల్ల ఒక్క మరణం కూడా సంభవించకూడదనే లక్ష్యంతో వ్యవస్థలు రూపు దిద్దుకుంటున్నాయి. మన దేశంలో కూడా ఇదే లక్ష్యం కావాలి.
తీసుకోవలసిన భద్రతా చర్యలు
ప్రతి విద్యుత్ ప్రమాదాన్ని ‘అనివార్యమైన ప్రమాదం’గా కాకుండా, ‘నివారించగలిగిన వ్యవస్థ వైఫల్యం’గా పరిగణించే దృక్పథం ఏర్పడాలి. తెగిపోయిన 11 కేవీ లేదా 33 కేవీ విద్యుత్ లైన్ నేలపై పడిన క్షణంలోనే సంబంధిత రక్షణ వ్యవస్థ స్పందించి ఫీడర్ను ట్రిప్ చేయాలి. అది జరగకపోతే ఆ రక్షణ వ్యవస్థ ఎందుకు పనిచేయలేదో విచారణ జరగాలి. రక్షణ పరికరాల లోపమా? నిర్వ హణ నిర్లక్ష్యమా? పరీక్షలు సకాలంలో జరగలేదా? లేక పర్యవేక్షణలో వైఫల్యమా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడే తదుపరి ప్రమాదాన్ని నివారించగలం.
ఇక మరో ముఖ్యమైన అంశం – విద్యుత్ ప్రమాదాలను కేవలం ఉద్యోగుల సమస్యగా చూడరాదు. వీటిలో పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలు, రైతులు, చిన్నారులు కూడా బలవుతున్నారు. తెగిపడిన తీగలను తాకడం, ట్రా¯Œ ్సఫార్మర్ల సమీపంలో నిర్లక్ష్యంగా తిరగడం, చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు తగిలినా పట్టించుకోకపోవడం, అక్రమ విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడం వంటి కారణాలు కూడా ప్రమాదాలకు దారితీస్తున్నాయి.
ఒక ఆధునిక విద్యుత్ వ్యవస్థలో మూడు రక్షణ వలయాలు ఉండాలి – నాణ్యమైన ఇంజినీరింగ్ రూపకల్పన, సమర్థవంతమైన రక్షణ వ్యవస్థలు, కఠినమైన భద్రతా సంస్కృతి. ఈ మూడూ బలంగా ఉన్నప్పుడే విద్యుత్ ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి. వీటిలో ఏ ఒక్కటి బలహీనపడినా, దాని మూల్యం ఒక అమాయ కుడి ప్రాణంగా మారుతుంది.
ప్రతి విద్యుత్ ప్రమాదం తర్వాత ఒకే ప్రశ్న మనకు మనం వేసుకోవాలి – ‘ఈ ప్రమాదం నిజంగా తప్పించలేనిదేనా?’ నిజా యితీగా సమాధానం వెతికితే, చాలా సందర్భాల్లో జవాబు ‘కాదు’ అనే వస్తుంది. అప్పుడు మనం అంగీకరించాల్సిన సత్యం ఒక్కటే– ప్రాణాలను కోల్పోయిన వారు విద్యుత్ వల్ల కాదు; భద్రతా వ్యవస్థ లోని లోపాల వల్ల మరణించారు అని. ఈ సత్యాన్ని అంగీకరించిన రోజే విద్యుత్ రంగంలో నిజమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టి నట్లవుతుంది.
– తుల్జారాంసింగ్ ఠాకూర్, రిటైర్డ్ విద్యుత్ ఇంజినీర్


